వాజేడు, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు పల్లెప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నది. మెజార్టీ గ్రామాల్లో పార్కులు అందుబాటులోకి వచ్చి ప్రజలకు ఆహ్లాదం పంచుతుంటే ములుగు జిల్లా వాజేడు మండలంలోని చెరుకూరులో మాత్రం అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా వనం ఎండిపోతున్నది. మండలంలోని 17 పంచాయతీల్లో ఒక్కో పల్లె ప్రకృతి వనానికి రూ.6లక్షలు, ఒక్కో వైకుంఠధామానికి రూ.12లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2021 మార్చిలోగా అన్ని పంచాయతీల్లో పనులు కావాల్సి ఉన్నది. కాగా చెరుకూరులో ఏర్పాటైన పల్లె ప్రకృతి వనంలో నీళ్లు లేక మొక్కలు ఎండిపోతుండగా ఇప్పటికీ ఇక్కడికి రహదారి సౌక ర్యం లేదు. కనీసం బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. మొక్కల సంరక్షణపై దృష్టి సారించకపోవడంతో అన్నీ చనిపోతున్నాయి. ఇక్కడ మూడు వేలకు పైగా మొక్కలు నాటాల్సి ఉండగా కేవలం వెయ్యిలోపే నాటి వదిలేశారు.
పూర్తికాని వైకుంఠధామం
రూ.12లక్షలతో చేపట్టిన వైకుంఠధామం పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. హడావిడిగా చేస్తుండడంతో రేకుల షెడ్డు నిర్మాణాల కింద పగుళ్లు తేలాయి. వైకుఠధామానికి ఇంకా బోరు సౌకర్యం కూడా కల్పించలేదు. శ్మశానవాటిక ఆవరణ ను చదును చేయలేదు. దీంతో నిర్మాణాల చుట్టూ పిచ్చిచెట్లు పెరిగాయి. సోలార్ లైట్లు సైతం ఏర్పాటు చేయకపోగా పను లు పూర్తికాకుండానే రంగులు వేశారు. ఇక సెగ్రిగేషన్ షెడ్డు పనుల్లో నాణ్యత లోపించి గోడలు అప్పుడే బీటలు వారాయి.