న్యూఢిల్లీ, మార్చి 18: ప్రస్తుతమున్న ఆరోగ్య బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఆదేశించింది. మార్పులతో బీమా ప్రీమియంలు పెరుగవచ్చని, ఇదే జరిగితే పాలసీదారులు ఇబ్బంది పడుతారన్నది. వ్యక్తిగత ప్రమాద బీమా, ప్రయాణ బీమా కవరేజీల జోలికీ వెళ్లరాదన్నది.
పాలసీదారుల అంగీకారంపై స్టాండలోన్ ప్రీమియం రేటుతో ప్రస్తుత ప్రయోజనాలకు కొత్త వాటిని జత చేసుకోవచ్చని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది. అలాగే ఆరోగ్య బీమా వ్యాపారంలో పాలసీల కోసం గతేడాది జూలైలో జారీ చేసిన ఏకీకృత మార్గదర్శకాలకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకునేలా అనుమతినిచ్చింది. ఇక పాలసీల లాభాలు కస్టమర్లందరికీ సులభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టాలని ఇన్సూరెన్స్ సంస్థలకు ఐఆర్డీఏఐ సూచించింది.
బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 74 శాతానికి పెంచేందుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో బీమా సంస్థల మూలధన అవసరాలను తీర్చడానికి ఎఫ్డీఐ పెంపు దోహదపడగలదని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్నారు.
ప్రజలు విరివిగా కరోనా వ్యాక్సిన్లు తీసుకుంటున్న నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఓ కీలక నిర్ణయం వెల్లడించింది. ఆరోగ్య బీమా ఉన్నవారు కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రియాక్షన్కు గురై ఆస్పత్రిలో చేరితే ఆ ఖర్చులూ బీమా పరిధిలోకే వస్తాయని గురువారం ప్రకటించింది. అయితే ఇది షరతులకు లోబడి వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఈ నెలాఖరుదాకా మెచ్యూరిటీ క్లెయిమ్ డాక్యుమెంట్లను పాలసీదారులు తమ సమీప ఎల్ఐసీ కార్యాలయంలో సమర్పించి సెటిల్మెంట్ చేసుకోవచ్చని ఎల్ఐసీ తెలియజేసింది. ఈ నిర్ణయం.. జోన్లు, డివిజన్లు, శాఖలు అన్న తేడా లేకుండా వర్తిస్తుందని ఎల్ఐసీ స్పష్టం చేసింది.
దేశంలో అందరికీ ఆరోగ్య బీమాను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఆరోగ్య సంజీవని పాలసీ కవరేజీల్లో ఐఆర్డీఏఐ మార్పులు చేసింది. స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో కనీస పరిమితిని రూ.50వేలకు తగ్గించగా, గరిష్ఠ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.