నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు.. 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలకు దిశానిర్దేశం చేయబోతున్నాయా? పెరిగిన ధరలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, పెరుగుతున్న నిరుద్యోగం వంటివి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెంచాయా? మోదీ సర్కారు చెప్తున్న మాటలతో జనం ఏకీభవిస్తున్నారా అనేదానిపై ఈ ఎన్నికలతో కొంత స్పష్టత రానుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత చరిష్మా ఓట్లు తెస్తుందని, కరోనాను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని, సరిహద్దుల్లో చైనా మీదకు దూకుడుగా వెళ్లడం వంటివి తనకు లాభిస్తాయని బీజేపీ బలంగా నమ్ముతున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వస్తామని, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిల్లో విజయం సాధిస్తామని అంటున్నది. కేరళ, తమిళనాడుల్లోనూ ప్రాబల్యం చూపించగలమని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్తోపాటు ఈ ఐదు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ వాదనను తిప్పికొట్టేందుకు అస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మోదీ చరిష్మా, కరోనా విషయంలో కేంద్రం పనితీరు, చైనాపై వైఖరి విషయంలో బీజేపీ ప్రభుత్వం చెప్తున్నదంతా వాస్తవ దూరమంటూ వాటిలో ఉన్న లొసుగులను ప్రచారం చేయనున్నాయి.
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లీటరు పెట్రోలు 100 రూపాయలకు చేరడం, డీజిల్ ధర కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం, వంట గ్యాస్పై సబ్సిడీ దాదాపు ఎత్తేసి ధర పెంచడం.. ఇవన్నీ పేద, మధ్యతరగతి ప్రజలపై బాగా ప్రభావం చూపిస్తున్నాయి. వీటి విషయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా అది నిరసనల రూపం లో పెద్దగా బయటపడటం లేదు. కానీ ఎన్నికల్లో మాత్రం అవి కచ్చితంగా ప్రభావం చూపుతాయని బీజేపీ ప్రత్యర్థి పార్టీలన్నీ గట్టి నమ్మకంతో ఉన్నా యి. ఓటర్లు వాటిని పక్కనపెట్టి బీజేపీని ఆదరిస్తే- తమ నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలనే ప్రజ లు నమ్ముతున్నారని ఆ పార్టీ బలంగా ప్రచారం చేసుకుంటుంది. కమలదళం ముందెన్నడూ లేని విధంగా పార్టీ సిద్ధాంతాలను కాకుండా ఒకే వ్యక్తి ఆకర్షణను నమ్ముకుని ముందుకెళుతున్నది. మోదీని బాహుబలిలా చూపించడం ఆ పార్టీ గత కొంతకాలంగా అనుసరిస్తున్న పంథా. ఇది సత్ఫలితాలనిస్తుందా లేదా వికటిస్తుందా అనేది కూడా ఈ ఎన్నికల్లో తేలనున్నది.
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాల్లో అసోంలో తప్ప మిగిలిన నాలుగింటిలో బీజేపీకి ఎక్కడా గట్టి పట్టు లేదు. కాబట్టి గెలిస్తే బలం పెరిగినట్టవుతుందిగానీ, ఓడితే కొత్తగా పోగొట్టుకునేదేమీ ఉండదు. పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు అర్ధాంతరంగా కూలిపోవడానికి బీజేపీ రాజకీయమే కారణమన్నది జగమెరిగిన సత్యం. ఈ ఎన్నికల్లో బీజేపీ అక్కడ గెలిచి, కేరళ, తమిళనాడుల్లో బలం చూపగలిగితే దక్షిణాది ప్రజలూ తమ వెంటే ఉన్నారని ఆ పార్టీ చెప్పుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, పుదుచ్చేరి, కేరళలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే విజయం సాధించడం ఆయా పార్టీలకు అత్యవసరం. అధికారాన్ని తిరిగి సాధించుకోలేకపోతే అది తిరోగమన పయనమే అవుతుంది. ఆ ప్రభావం మూడేండ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల మీద చాలా బలంగా ఉంటుంది.