సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ ) : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం జరిగే పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికను శాంతియుతంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఇందుకుగాను సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలి పరిధిలో 5,31,268 ఓటర్లు ఉండగా, 799పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో మొత్తం 3835మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటుండగా, వీరిలో 959మంది పీఓలు, ఏపీవోలు 2876 మంది ఉన్నారు. ఈ మేరకు శనివారం ఎల్బీస్టేడియం నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్కు సంబంధించిన సామగ్రిని ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు. కాగా రెండు గంటలకోకసారి పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన అనంతరం బాక్స్లను సరూర్నగర్ ఇండోర్ స్టేడియానికి తరలించనున్నారు. ఈ నెల 17న ఎల్బీనగర్లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 22న ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు.
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల వివరాలు
తొమ్మిది జిల్లాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలో నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటింగ్లో పాల్గొంటారు.
మొత్తం 5,31,268 ఓటర్లు ఉండగా, వీరిలో 3,36,256 మంది పురుషులు, 1,94,944 మంది మహిళలు ఉన్నారు. 68మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఓటర్లే కీలక పాత్ర పొషించనున్నారు. ఈ జిల్లాలో అత్యధికంగా 1,44,416 ఓటర్లు ఉండగా, తక్కువగా నారాయణపేట జిల్లాలో 13,899మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
నియోజకవర్గంలో 799పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో మహబూబ్నగర్ జిల్లాలో 56, నాగర్కర్నూల్లో 44, వనపర్తిలో 31, జోగులాంబ గద్వాల్లో 22, నారాయణ్పేటలో 20, రంగారెడ్డి జిల్లాలో 199, వికారాబాద్లో 38, మేడ్చల్-మల్కాజిగిరిలో 198, హైదరాబాద్ జిల్లాలో 191 ఉన్నాయి.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణ సాఫీగా జరుగడానికిగాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్లను ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల నిర్వహణలో 3835 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటారు. వీరిలో 959 మంది పీఓలు, ఏపీవోలు 2876 మంది ఉన్నారు.
ఎన్నికల బరిలో అభ్యర్థులు అధికంగా 93మంది ఉండటంతో జంబో బ్యాలెట్ పేపర్తో పాటు జంబో బ్యాలెట్ బాక్స్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు చొప్పున 1598 బ్యాలెట్ బాక్స్లు అదనంగా 324 సిద్ధంగా ఉంచారు.
ఈ జంబో బ్యాలెట్ బాక్స్లలో పోలింగ్ కేంద్రాలకు అదనంగా 20శాతం కలిపి మహబూబ్నగర్ జిల్లాకు 269బాక్స్లు, నాగర్కర్నూల్కు 212, వనపర్తి జిల్లాకు 149, జోగులాంబ గద్వాల్కు 106, నారాయణపేట్కు 96, రంగారెడ్డి జిల్లాకు 956, వికారాబాద్కు 183, మేడ్చల్-మల్కాజిగిరికి 951, హైదరాబాద్ జిల్లాకు 917 బాక్స్లను కేటాయించారు.
80ఏండ్ల వృద్ధులకు, కరోనా పాజిటివ్ ఓటర్లకు వారి ఇంటి వద్దకే ఎన్నికల సిబ్బంది వెళ్లి పోస్టల్ బ్యాలెట్తో ఓటు వేయించారు.
ప్రతి పోలింగ్ కేంద్రానికి నలుగురు ఎన్నికల అధికారులతో పాటు 120ప్రాంతాల్లో మైక్రో అబ్జర్వర్లు కూడా ఉంటారు.