న్యూఢిల్లీ: సహాయంలో ముందుండే భారత నౌకాదళం మరోసారి దీనిని నిరూపించింది. సాంకేతిక సమస్యతో సముద్రంలో చిక్కుకున్న కార్గో షిష్కు అవసరమైన సహాయాన్ని అందించింది. ఏడుగురు భారతీయ సిబ్బంది ఉన్న ఎంవీ నయన్ అనే రవాణా నౌక ఇటీవల ఒమన్ నుంచి ఇరాక్కు బయలుదేరింది. అయితే ఈ నెల 9న ఆ నౌకలోని ప్రొపల్షన్, విద్యుత్, నేవిగేషన్ వ్యవస్థల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎంవీ నయన్ ఒమన్ గల్ఫ్లోని సముద్రంలో చిక్కుకుని నీటి ప్రవాహానికి కొట్టుకుపోసాగింది. ఈ నేపథ్యంలో అందులోని సిబ్బంది సహాయం కోసం సందేశాన్ని పంపారు.
మరోవైపు ఒమన్ గల్ఫ్ సముద్ర జలాల్లో మోహరించిన ఐఎన్ఎస్ తల్వార్కు గురువారం ఆ సహాయ సందేశం అందింది. దీంతో నౌకాదళ సిబ్బంది తక్షణం రంగంలోకి దిగారు. తొలుత ఏరియల్ సర్వే ద్వారా రవాణా నౌక పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం సాంకేతిక సిబ్బంది ఒక బోటులో ఎంవీ నయన్ వద్దకు చేరారు. అందులోని విద్యుత్ జనరేటర్, ప్రొపల్షన్, నేవిగేషన్ వ్యవస్థలను సరి చేశారు. దీంతో రవాణా నౌక ఎంవీ నయన్ తదుపరి పోర్టునకు సురక్షితంగా చేరిందని భారత నౌకాదళం తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.