హన్మకొండ : ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) తెలంగాణ రాష్ట్ర సమావేశం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ మేరకు హన్మకొండలోని అభిరామ్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆత్మీయ అతిథులుగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలు ఉద్యోగ సంఘాల నాయకులు, ఆ సంఘం బాధ్యులు, వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..మన సీఎం కేసీఆర్ గతంలో 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తు పెట్టుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. పీఆర్సీ విషయంలో ఆందోళన వద్దన్నారు. మంచి ఫిట్మెంట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఓ శుభ వార్త వింటారన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా సీఎం కేసీఆర్ ఒక మంచి వార్త చెప్పనున్నట్లు తెలిపారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పథకాలను, కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని చెప్పారు. ప్రభుత్వ పనితీరుని కేంద్రం కూడా అభినందిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. అందరు మెచ్చిన కేసీఆర్ పాలనకు అనుకూలంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు.
అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, సీఎం కేసీఆర్ పాలనను చూడండి. మనకు మంచి పరిపాలన, మంచి అభ్యర్థి కావాలనుకుంటే తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. కేవలం ప్రశ్నించే గొంతులతో అయ్యేదేమీ లేదని, పరిష్కరించే గొంతులను మీరు ఎంచుకోవాలన్నారు. తాను పరిష్కార గొంతునవుతానని చెప్పారు.