చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే గృహిణులందరికీ నెలకు రూ 1500 నగదు అందిస్తామని, ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కే పళనిస్వామి హామీ ఇచ్చారు. ఇక డీఎంకే అధికారంలోకి వస్తే గృహిణులకు ప్రతినెలా రూ 1000 అలవెన్స్ ఇస్తామని ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రకటించిన మరుసటి రోజే పళనిస్వామి గృహిణులపై వరాల జల్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ హామీ ఇస్తున్నానని పళనిస్వామి పేర్కొన్నారు.
తమ పార్టీ మేనిఫెస్టోకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము పదిరోజులుగా దీనిపై కసరత్తు సాగించామని, తమ మేనిఫెస్టో లీకైన తర్వాత డీఎంకే ఒక రోజు ముందు గృహిణులకు అలవెన్స్ ప్రకటించిందని అన్నారు. ఒకే ఐడియాలు ఉండటం సహజమని ఆయన సమర్ధించుకున్నారు. మరోవైపు తాము ముందుగా గృహిణులకు ప్రతినెలా అలవెన్స్ అందిస్తామని ప్రకటించగా డీఎంకే దాన్ని కాపీ కొట్టిందని మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ ఆరోపించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎంకే, ఏఐఏడీఎంకే మహిళలు, విద్య, వైద్య రంగాలకు సంబంధించి పోటాపోటీగా పలు పథకాలు, హామీలను గుప్పిస్తున్నాయి. భారీ నిధులు వెచ్చించి ఈ పథకాలను ఎలా అమలు చేస్తారనే దానిపై మాత్రం ఆయా పార్టీలు స్పష్టత ఇవ్వడం లేదు.