బుకావు: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఒక ప్రాంతంలో బంగారు గని ఒకటి తాజాగా బయటపడింది. దీంతో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని తవ్వకాలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన పాలకులు ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. దక్షిణ కివు ప్రావిన్స్లోని కొండల్లో ఒక చోట ఇటీవల బంగారు గనిని గుర్తించారు. దీంతో పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పలుగు, పారలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గనిని తవ్వి బంగారంతో కూడిన మట్టిని సంచులు, తట్టల్లో ఇండ్లకు తీసుకెళ్లారు. అనంతరం నీటితో మట్టిని కడిగి అందులోని చిన్నచిన్న బంగారు రాళ్లను వెలికితీశారు. అహ్మద్ అల్గోబరీ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ విషయం ఆ దేశ పాలకులు, అధికారుల దృష్టికి వెళ్లింది. లుహిహిలో బంగారం అధికంగా ఉన్న ధాతువును కనుగొన్నట్లు కివు ప్రావిన్స్కు చెందిన గనుల మంత్రి వెనంత్ బురుమే ముహిగిర్వా ధృవీకరించారు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు అక్కడకు వెళ్లి బంగారం ధాతువును సేకరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామంతోపాటు చుట్టుపక్కల అన్ని మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని సోమవారం డిక్రీ జారీ చేసినట్లు చెప్పారు.
తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు మైనింగ్ చేసేవారు, వ్యాపారులు, డీఆర్సీ సాయుధ దళాలు ఆ గని స్థలాలను విడిచి వెళ్లాలని ఆదేశించినట్లు ముహిగిర్వా తెలిపారు. మైనింగ్ నిబంధనల మేరకు నమోదు కోసం ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఉత్తర కివి, దక్షిణ కివి, ఇటురి ప్రావిన్స్ల్లో బంగారు గనుల ఎక్కువగా ఉన్నాయి. 2019లో ఇక్కడ 60 కేజీలకు పైగా ముడి బంగారాన్ని వెలికితీసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే అనధికారిక ఉత్పత్తి 70 కేజీలకు మించి ఉంటుందని ఐరాస నిఫుణుల బృందం అంచనా వేసింది.