జిల్లాలో వానకాలం పంటలకు సాగునీరు కొరత లేదు
వైరా, లంకాసాగర్ ఆయకట్టు రైతులు నాట్లు వేసుకోవచ్చు
పది రోజుల్లో కాలువల మరమ్మతులు, జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేయాలి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి
ఖమ్మం, జూలై 19:నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఆగస్టు16 నుంచి సాగునీటిని విడుదల చేయనున్నామని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. వానకాలం 2021-22 యాక్షన్ ప్లాన్పై మంత్రి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్నెస్పీ ఆయకట్టు రైతులకు సాగునీటి విడుదల విషయంపై సమావేశ మందిరం నుంచే నల్గొండ మంత్రి జి.జగదీశ్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం సాగునీటి విడుదల విషయాన్ని మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరా, లంకాసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు రైతులకు వానకాలం పంటలకు ఎలాంటి నీటి కొరత లేదని, నాట్లు వేసుకోవచ్చన్నారు.
వైరా ప్రాజెక్టులో సరిపడా నీరు ఉందని, దీని పరిధిలోని రైతులు నాట్లు వేసుకుంటున్నారని, లంకాసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు కూడా నాట్లు వేయవచ్చని మంత్రి అన్నారు. జిల్లాలో 27 చెక్డ్యామ్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వీటిని పూర్తి చేసుకోవడం ద్వారా 0.425 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకోవచ్చని అన్నారు.
సమావేశాలు నిర్వహించాలి
అన్ని రైతు వేదికల్లో ప్రతి వారమూ రైతులు, రైతుబంధు సమితి సభ్యులతో కలిసి వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించాలని మంత్రి అజయ్ సూచించారు. రైతుల సమస్యలు, నీటి వనరులు, రైతులు పండించాల్సిన పంటలు, కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పంటల డిమాండ్ తదితర అంశాల గురించి చర్చించాలన్నారు. ఆయా సమావేశాల వివరాలన్నీ డాక్యుమెంటరీ రూపంలో తనకు పంపించాలని ఆదేశించారు.
పది రోజుల్లో పూర్తిచేయాలి
నీటిపారుదల శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు వచ్చినా ఆశించిన మేరకు ఫలితాలు రావడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వానకాలం పంటలు వేసే సమయం వస్తున్నా ఎన్ఎస్పీ మేజర్ కాలువపై ఉన్న జంగిల్ క్లియరెన్సులు, కాలువలకు చిన్న చిన్న మరమ్మతులు చేయలేదని రైతుబంధు సమితి సభ్యులు తెలుపడంతో మంత్రి వెంటనే సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజుల్లో పనులకు టెండర్లు పిలిచి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెరగడంతో రియల్ వ్యాపారులు చెరువులను, కుంటలను , కాలువలను ఆక్రమించే పనిలో ఉన్నారని అన్నారు. నీటి పారుదల శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా బౌండరీలు ఏర్పాటు చేసి భూములను రక్షించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఖమ్మం చుట్టుపక్కల అనేక చెరువులు, కాలువలను రియల్ వ్యాపారులు ఆక్రమించారని, వాటన్నింటినీ వెలికితీయాలని సూచించారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల పునరుద్ధరణపై మంత్రి మాట్లాడుతూ కాలువలను వెంటనే పూర్తి చేయాలన్నారు.
రైతుల ప్రయోజనాలే ముఖ్యం: కలెక్టర్
ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. చెరువులు, నాలాలు, ఇతర నీటి పథకాలను పరిశీలించి మండల స్థాయి సమావేశాల్లో రైతుబంధు సమతి సభ్యులను భాగస్వామ్యం చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నీటి వనరులకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారిపై ఇరిగేషన్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ నిరుడు మధిర నియోజకవర్గంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు అవగాహన కల్పించేలా రైతు వేదికలను ఉపయోగించాలని అన్నారు. అదనపు కలెక్టర్ ఎస్.మధుసూదన్రావు, శిక్షణ కలెక్టర్ రాహుల్, ఇరిగేషన్ సీఈ శంకర్నాయక్, ఇరిగేషన్ జిల్లా అధికారి ధన్కుమార్రెడ్డి, డీఏవో విజయనిర్మల, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు, మండల కన్వీనర్లు, సలహామండలి సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.