ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బదిలీ అయ్యారు. దాదాపు మూడేళ్ల పాటు కలెక్టర్గా పని చేసిన కర్ణన్ జిల్లా పాలనలో తనదైన ముద్ర వేశారు. సౌమ్యుడిగా, సమర్థుడిగా పేరొందిన కలెక్టర్ కరీంనగర్ జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న వీపీ గౌతమ్ని ఖమ్మం కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ కొద్దికాలం క్రితం వరకు భద్రాచలం ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తించారు. గౌతమ్కు సమర్థుడైన అధికారిగా పేరుంది. ఆయన 2014 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. – ఖమ్మం, జూలై 19 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి)
ఖమ్మం కలెక్టర్గా ఆర్వీ కర్ణన్ 2018 ఆగస్టు 30వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో శాసనసభ, లోక్సభ, గ్రామంపంచాయతీ, మండల, జిల్లా పరిషత్, సహకార సంఘాలు, మున్సిపల్, ఎమ్మెల్సీ, నగర కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగుకుండా ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. ప్రధానంగా నూతన ఓటర్ల నమోదును అత్యధికంగా జరిగేలా చూడడం, ప్రతి ఎన్నికల్లోనూ పారదర్శకంగా వ్యవహరించడం ద్వారా ఆయన పాలన రంగంలో ప్రత్యేకతను చాటుకున్నారు.
కొవిడ్ కట్టడి..
కొవిడ్ మొదట, రెండో దశ వ్యాప్తి జిల్లాలో విస్తృతంగా ఉన్న సమయంలో జిల్లా పాలనాధికారిగా ప్రజా ప్రతినిధుల తోడ్పాటుతో కరోనా నియంత్రణకు పకడ్బందీ ప్రణాళికలను రూపొందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటు కోసం ప్రభుత్వాన్ని ఒప్పించి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహకారంతో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. కొవిడ్ రెండోదశ విజృంభిస్తున్న క్రమంలో ఆక్సిజన్ కొరత లేకుండా చేయగలిగారు. జిల్లాలో పేపర్ రహితపాలనకు శ్రీకారం చుట్టి ఈ – పాలన పలు ప్రభుత్వ శాఖల్లో అమలు అయ్యేలా చూశారు. వీపీ గౌతమ్ ఖమ్మం 49వ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. కల్టెకర్ కర్ణన్ మంగళవారం విధుల్లోంచి రిలీవ్ అయి కరీంనగర్ కల్టెకర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.