కిలో రూ.300 పలుకుతున్న ‘బాయిలర్’ మాంసం
గుడ్లు తేలేసేలా.. గుడ్ల ధరలు
దుకాణాల్లో ఒక్కొంటికి రూ.6 ధర
ఖమ్మం వ్యవసాయం, జూలై 18: ఆదివారం వచ్చిందంటే చాలు నోరూరిస్తుంది.. ఇల్లంతా మసలా ఘుమఘుమలు నింపుతుంది.. ఇంటికి చుట్టాలు వచ్చినా, స్నేహితులు వచ్చినా ఇంటికో కూర తీసుకురావాల్సిందే.. పండగైనా, పబ్బమైనా పేదోడికి టక్కున గుర్తొచ్చే వంటకం ఇదే.. ఇప్పుడు ‘చికెన్’ ధర కొండెక్కి దిగి రానంటున్నది.. కిలో మాంసం రూ.300కు చేరుకుని ఉసూరుమనిపిస్తున్నది.. రెండు నెలల నుంచి పెరుగుతున్న ధరలపై ‘నమస్తే’ కథనం..
ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో నాన్వెజ్ ఘుమఘుమలు గుప్పు మనాల్సిందే.. మాంసం ప్రియులకు ఇదొక పండుగ లాంటిది.. ఇక చుట్టాలు వచ్చారంటే మాంసం తప్పనిసరి. ఒక్కొక్కరిది ఒక్కో టేస్టు. ఒకరికి మటన్ ఇష్టమైతే మరొకరికి చికెన్ ఇష్టం. చికెన్ ప్రియులకు మాత్రం ‘కోడి కూర’ మరీ ప్రియం అయిపోయింది. ఇప్పుడు చికెన్ అంటేనే ‘అయ్య..బాబాయ్’ అనుకుంటున్నారు పేద, మధ్య తరగతి జీవులు. కిలో ధర రూ.300 పలుకుతుండడంతో కొనడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నారు. కొందరు కిలో కొనే బదులు అరకిలో కొని ఆరోజుకు సరిపెట్టుకుంటున్నారు. సరే.. గుడ్డుతో అయినా సరిపెట్టుకుందాం అనుకుంటే వాటి ధరలూ ‘గుడ్లు తేలేసేలా..’ ఉన్నాయి. గడిచిన రెండు నెలల నుంచి చికెన్ ధరలు కలవరపెడుతున్నాయి. కరోనా మొదలైన కాలంలో కిలో రూ.50 అన్న ఎవరూ కొనని స్థితి నుంచి ఇప్పుడు ‘అమ్మో.. చికెన్ ధరలు..’ అన్న రేంజ్కి ధర పెరిగింది. ఒకానొక సమయంలో పౌల్ట్రీలో కోళ్లను గుండు గుత్తగా అమ్మిన సందర్భాలూ లేకపోలేదు. ఈసమయంలో కొందరు పౌల్ట్రీ నిర్వాహకులు వ్యాపారం నుంచే బయటకు వచ్చారంటే అతిశయోక్తి లేదు.
అన్లాక్ తరువాత పెరుగుదల..
పౌల్ట్రీ ఇండస్ట్రీలపై రెండు విడతల కరోనా ప్రభావం ఎక్కువగా పడింది. ముఖ్యంగా రెండో వేవ్ సమయంలో కోళ్ల ఫారాల్లో కోళ్ల ఉత్పత్తి ఎక్కువగా జరగలేదు. లాక్డౌన్ ఇబ్బందుల నేపథ్యంలో పౌల్ట్రీ నిర్వాహకులు కోళ్ల పెంపకాన్ని తగ్గించాల్సి వచ్చింది. దీంతో కొవడ్ అన్లాక్ తర్వాత అంచెలంచెలుగా చికెన్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కొవిడ్ను ఎదుర్కోవాలంటే వ్యాధి నిరోధక శక్తి అవసరమని తెలుసుకున్న ప్రజలు ఎక్కువగా చికెన్పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కిలో చికెన్ ధర రూ.180-200 ఉన్న ధర ఇప్పుడు రూ.100 పెరిగి రూ.300 మైలు రాయి దాటింది. చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా చికెన్ విక్రయాలు జరుగుతున్నాయి.
చికెన్ బాటలోనే కోడిగుడ్డు ధరలు..
చికెన్ ధరల ప్రభావం కోడిగుడ్డుపైనా పడుతున్నది. కరోనా తర్వాత కోడి గుడ్ల వినియోగం అమాంతం పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా అందరూ తాము తీసుకునే ఆహారంలో గుడ్డు ఉండేలా చూస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు ఉన్న ఇళ్లలో వినియోగం ఎక్కువగా ఉన్నది. గతేడాది ఒక గుడ్డుకు రూ.4 ఉన్న ధర ఇప్పుడు రిటైల్ ధర ఒక గుడ్డుకు 5.45కు చేరింది. దీంతో దుకాణదారులు రూ.6 నుంచి రూ.6.50కు విక్రయిస్తున్నారు. మున్ముందు కోళ్ల ఉత్పత్తి పెరిగితే చికెన్, గుడ్ల ధరలు తగ్గనున్నాయి. మరో నెల రోజుల పాటు ఇవే ధరలు ఉండే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రతివారం ధర పెరుగుతున్నది..
ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారుల తాకిడి బాగానే ఉన్నది. నెల రోజుల వ్యవధిలోనే కిలో ఒక్కింటికి రూ.50 పైగా పెరిగింది. పెరిగిన ధరల నేపథ్యంలో చికెన్ వినియోగదారులకు ఇబ్బందికరంగానే ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో చికెన్ ధర రూ.300కు చేరింది. డిమాండ్కు తగినన్ని కోళ్ల సైప్లె లేకపోవడం వల్లే ఈ పరిస్థితి.