త్వరలో డీలర్ల నియామకం
కలెక్టర్లతో వీసీలో మంత్రి గంగుల కమలాకర్
అంచనాలకు మించి ధాన్యం కొనుగోలు
మామిళ్లగూడెం, జూన్ 18: రేషన్ కార్డు దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తి చేసి అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, రేషన్ కార్డుల జారీపై శుక్రవారం కరీంనగర్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన వెరిఫికేషన్ చేసి వారం రోజుల్లో జాబితాను పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. అద్దె ఇళ్లల్లో ఉండే వారికి అదే చిరునామాతో కార్డులు మంజూరు చేస్తామన్నారు. స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో త్వరలో రేషన్ డీలర్లను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల వారీగా రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
ధాన్యం కొనుగోలులో సరికొత్త రికార్డు
ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టించిందని మంత్రి తెలిపారు. ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇంకా రాష్ట్రంలో దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ వివరాలను మంత్రికి వివరించారు. జిల్లాలో 3.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇప్పటి వరకు రైతుల ఖాతాలకు రూ.432 కోట్లు జమ చేశామని వివరించారు. జిల్లాలో రేషన్ కార్డుల కోసం 18,773 మంది దరఖాస్తు చేసుకోగా పరిశీలన ప్రక్రియ జరుగుతుందన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఎస్వో రాజేందర్, మేనేజర్ సోములు పాల్గొన్నారు.