కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 17: కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో గంజాయి ఘాటు గుప్పుమంటున్నది.. యువతను టార్గెట్ చేసి కొందరు అక్రమార్కులు జోరుగా గంజాయి విక్రయానికి పాల్పడుతున్నారు.. ఇటీవల పట్టణంలోని పలు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల నిల్వలు పట్టుబడుతుండడం, మత్తు పదార్థాలు తీసుకుని ఆకతాయిలు అరాచకాలకు పాల్పడుతుండడంపై పట్టణవాసుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.. ఈ నేపథ్యంలో గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.. గడిచిన ఐదు నెలల్లో 10,231 క్వింటాళ్ల సరుకుని పట్టుకున్నారు.. నిందితులు ఎంతటి వారైనా వదలిపెట్టేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
మాదక ద్రవ్యాల మత్తులో పడి కొందరు యువకులు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు.. మత్తు తలకెక్కి అల్లర్లకు పాల్పడుతున్నారు.. ఇదంతా ఎక్కడో మారుమూల ఏజెన్సీలో కాదు సాక్షాత్తూ కొత్తగూడెం జిల్లాకేంద్రంలోనే. ఒకవైపు పోలీస్శాఖ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నా అక్రమార్కులు మాత్రం పోలీసుల కళ్లు గప్పి యువతకు గంజాయి విక్రయిస్తున్నారు. మత్తుకు బానిసలు చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంతో పాటు చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు పరిసర ప్రాంతాల్లో జోరుగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ, హనుమాన్ బస్తీ, రామా టాకీస్ ఏరియా, రామవరం, గొల్లగూడెం, గాజులరాజం బస్తీ, బాబూ క్యాంప్, విద్యానగర్, చుంచుపల్లి, హౌసింగ్బోర్డ్ ఏరియా, ముఖ్యంగా రుద్రంపూర్, గౌతంపూర్, త్రీ ఇైంక్లెన్, ఎస్సీబీనగర్లో గంజాయి అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒడిశా, ఆంధ్రా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు సరుకు తీసుకువచ్చి జిల్లాలో విక్రయిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, అశ్వరావుపేట, భద్రాచలం, మణుగూరు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు దళారులుగా వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఐదు నెలల్లో కేసులు ఇలా..
గడిచిన ఐదు నెలల్లో జిల్లా పోలీసులు గంజాయి విక్రయాలపై 30 కేసులు నమోదు చేశారు. 80 మంది గంజాయి విక్రయదారులు, గంజాయి రవాణా చేసిన వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసుల్లో మొత్తం 137 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.20.46 కోట్ల విలువ చేసే 10,231కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 14 కార్లు, ఏడు వ్యాన్లు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఒక లారీని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన సరుకులో కేవలం చుంచుపల్లి పొలీస్ స్టేషన్ పరిధిలోనే 5,863 కిలోల గంజాయి పట్టుబడడం గమనార్హం. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 609 కిలోలు, భద్రాచలం పోలీస్ సర్కిల్ పరిధిలో 200 కిలోల గంజాయి పట్టుబడింది.
ఇటీవల జిల్లా కేంద్రంలో అరాచకాలు..
జిల్లాకేంద్రంలోని ప్రగతినగర్కు చెందిన ఓ ప్రైవేటు టీచర్ ఇంటికి గత సోమవారం రాత్రి మాదక ద్రవ్యాలు తీసుకున్న కొందరు యువకులు వచ్చారు. ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారు. ఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హనుమాన్ బస్తీలో ఇటీవల కొందరు యువకులు గంజాయి మత్తులో ఇళ్ల ముందు పార్క్ చేసి ఉన్న కార్ల అద్దాలను ధ్వంస చేశారు. పోస్టాఫీస్ ఏరియాకు చెందిన కొందరు ఆకతాయిలు గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి ఓ బాటసారిపై దాడి చేశారు. అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అప్రమత్తమైన పోలీస్శాఖ..
గంజాయి మత్తులో కొందరు యువకులు అరాచకాలు పాల్పడుతుండంపై పోలీస్శాఖ అప్రమత్తమైంది. ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడినట్లు లేదా గంజాయి తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గంజాయి విక్రయాలను పోలీస్శాఖ తీవ్రంగా తీసుకుంటుందని, నిందితులు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను గమనిస్తూ ఉండాలని, ఎవరైనా మాదక ద్రవ్యాల బారిన పడితే వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచిస్తున్నారు.