జిల్లాలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్..
18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా
సర్కారు ఆదేశంతో కదిలిన యంత్రాంగం..
344 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ
ఇప్పటివరకు 4,22,405 మందికి వ్యాక్సిన్
వందశాతం పూర్తికి కార్యాచరణ
కొత్తగూడెం, సెప్టెంబర్ 17 : రాష్ట్ర ప్రభుత్వం టీకాల పండుగకు తెరలేపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించే స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గతానికి భిన్నంగా అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా వ్యాక్సిన్ సరఫరా చేయడంతోపాటు వాటి సత్వర వినియోగానికి చర్యలు చేపట్టింది. దీంతో కలెక్టర్ అనుదీప్ సారథ్యంలో జిల్లా వైద్యారోగ్యశాఖ రంగంలోకి దిగింది. గ్రామ పంచాయతీల సహకారంతో ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితాను సిద్ధం చేశారు.
కరోనా కట్టడికి తెలంగాణ సర్కారు సమరశంఖం పూరించింది. వైరస్ను అంతమొందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీ, అంగన్వాడీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ చేపట్టారు. అధికార యంత్రాంగం జిల్లాలో టీమ్ల ద్వారా ఇంటింటి సర్వే చేపడుతున్నది. ప్రతి గ్రామం, వార్డుల్లో వ్యాక్సినేషన్ జరిగేలా ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి కార్యక్రమాన్ని షురూ చేసింది. థర్డ్వేవ్ వచ్చినా.. రాకపోయినా కరోనా కట్టడిలో వంద శాతం సక్సెస్ కావాలని ఊరూరా టీకాల కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో4,22,405 మందికి రెండు డోసులు వేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 3,84,896 మంది, కొవాగ్జిన్ 37,509 మంది తీసుకున్నారు. వీరిలో పురుషులు 2,15,567 మంది, స్త్రీలు 2,06,763 మంది, ఇతరులు 75 మంది ఉన్నారు.
కేంద్రాల్లో వ్యాక్సినేషన్
జిల్లా వ్యాప్తంగా బృందాలుగా విడిపోయి 18 ఏండ్లు నిండిన వారికీ టీకాలు వేస్తున్నారు. వైద్యసిబ్బందితోపాటు అంగన్వాడీ, మున్సిపల్, పంచాయతీరాజ్, మెప్మా సిబ్బంది ఇంటింటి సర్వే చేసి వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. ప్రతి ఇంటికెళ్లి టీకాలు వేయించుకున్నారా లేదా అని విచారణ చేసి టీకాకు రమ్మని పిలుస్తున్నారు. అవసరమైతే ఇంటికెళ్లి వేస్తున్నారు. పది రోజులపాటు జరిగే కార్యక్రమంలో 4 లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ప్రత్యేక డ్రైవ్ను కలెక్టర్ అనుదీప్, డీఎంహెచ్వో శిరీష పర్యవేక్షిస్తున్నారు.
అందరికీ వ్యాక్సిన్ ..
అందరికీ వ్యాక్సిన్ వేయడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో 344 కేంద్రాల్లో టీకాలు వేయిస్తున్నాం. కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. గతంలో మొబైల్ వ్యాక్సిన్ వేశాం. ఎన్ని వేవ్లు వచ్చినా కట్టడి చేసేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.