చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా సాగు
25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం
70వేల ఎకరాలు తగ్గిన పత్తి సాగు విస్తీర్ణం
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 17 ;రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇతర పంటలు వేయాలని సూచించడంతో కర్షకులు ఆ దిశగా అడుగేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. వాణిజ్య పంటల సాగుకు చిరునామాగా నిలిచిన జిల్లా మరోమారు మిర్చి దిగుబడిలో రికార్డు సృష్టించనున్నది. ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల పంటలకు మంచి ధర పలుకుతున్నది. దీంతో రైతులు పత్తికి బదులు మిర్చి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 55,113 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,00,210 ఎకరాల్లో సాగైంది. సుమారు 44 వేల ఎకరాల్లో అధికంగా సాగు జరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి రెండు రెట్లు ఎక్కువగా మిర్చి పంట వేసే అవకాశం ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మిర్చి సాగు చేపట్టారు. ఖమ్మం జిల్లాలోనే నేటి వరకు మిర్చి సాగు లక్ష ఎకరాలు దాటిపోయింది. సీజన్ పూర్తయ్యే నాటికి మిర్చి సాగు 1.50 లక్షల ఎకరాలకు చేరే అవకాశం ఉందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పత్తిలో గులాబి రంగు పురుగు ఉధృత్తిని నివారించ లేక రైతులు మిర్చి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సాగు గణంకాల ప్రకారం ఈ ఏడాది ఎకరానికి సరాసరి 25 క్వింటాల దిగుబడి వచ్చినా.. జిల్లా వ్యాప్తంగా 25 లక్షల క్వింటాల మిర్చి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
అధికారుల గణంకాల ప్రకారం
జిల్లా వ్యవసాయశాఖ అంచనా ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా (మిర్చి మినహా) 5,96,149 ఎకరాల్లో పంటలు సాగు కావొచ్చని అంచనా వేశారు. గతేడాది జిల్లాలో వరి సాగు 2,89,942 ఎకరాలు కాగా.. ఈ సారి ఇప్పటివరకు 2,93,487 ఎకరాల్లో సాగైంది. అంటే వందకు నూట పదహారు శాతం సాగైనట్లు. గతేడాది జిల్లా వ్యాప్తంగా 2,68,112 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ సారి రైతులు కేవలం 1,91,768 ఎకరాలకు పరిమితం చేశారు. దీంతో 71 శాతం మాత్రమే సాగు జరిగినైట్లెంది. మిర్చి సాగుకు సంబంధించి గతేడాది జిల్లావ్యాప్తంగా 55,113 ఎకరాల్లో సాగు జరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,00,210 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. సుమారు 44 వేల ఎకరాల్లో సాగు అధికంగా జరిగింది. సాగుకు మరికొంత అవకాశం ఉండడంతో మిర్చి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మండలాల వారీగా మిర్చి తోటల వివరాలు..
ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,00, 210 ఎకరాలు సాగైనట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారులు ప్రకటించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సారి రెండు రెట్లు అధికంగా సాగు జరిగే అవకాశం కనిపిస్తున్నది.
మిర్చి సాగు మరింత పెరిగే అవకాశం ఉంది
జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు లక్ష ఎకరాలకు చేరింది. రానున్న రోజుల్లో మరో 20-30 వేల ఎకరాలు సాగు పెరిగే అవకాశం ఉంది. మిర్చితోటల సాగు, నారు యాజమాన్య పద్ధతులు తదితర అంశాలపై ఉద్యానశాఖ అధికారులు సాగు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
-జీ అనసూయ (జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి)
పత్తికి బదులుగా మిర్చి సాగు
ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా దాదాపుగా అన్ని మండలాల్లో పత్తి విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. పత్తి పంటను ఆశించే గులాబిరంగు పురుగు ఉధృతి నుంచి కాపాడుకోవడం కష్టంగా ఉందని రైతులు చెబుతున్నారు. మిర్చి పంటకు మంచి ధర ఉండడంతోపాటు ఏడాదిగా ధరలు నిలకడగా ఉన్నాయి. పత్తి సాగు చేసిన రైతులు మిర్చి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
-ఎం విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి