మైనర్ ఆయకట్టు సస్యశ్యామలం..
మత్తడి దుంకుతున్న 183 చెరువులు, పలు చెక్డ్యాంలు
ఫలిస్తున్న సీఎం కేసీఆర్ కృషి
రైతులకు అందుతున్న ‘మిషన్ కాకతీయ’ ఫలాలు
ఖమ్మం, జూలై 17: ఖమ్మం జిల్లాలోని మున్నేరు, ఆకేరు, బుగ్గవాగు నిర్మించిన చెక్డ్యాంలకు జలకళ సంతరించుకున్నది. వాటి పరిధిలోని చెరువుల్లోకి భారీగా వరద నీరొచ్చి చేరుతున్నది. ఒకనాడు జిల్లేడు చెట్లు మొలిచిన భూముల్లో నేడు పచ్చని పైర్లు కనువిందు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితాలను రైతులు అనుభవిస్తున్నారు. గత పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ పాలకులు చెరువు పునరుద్ధరించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయకట్టు సస్యశ్యామలం అవుతున్నది. చెరువు పునరుద్ధరణతో వరదనీరు చెరువులోకి చేరడంతో భూగర్భజలాలు పెరుగుతున్నాయి. ఫలితంగా బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంటున్నది. గతంలో చెరువు కింద ఆయకట్టు రైతులు ఒక్క పంటపైనే ఆధారపడేవారు.. అదీ వర్షం వస్తేనే పంట పండే పరిస్థితి. ప్రస్తుతం బావులు, బోర్లలో నీరుండడంతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. వానకాలంలో వరి, మిర్చి, పత్తి పండించిన రైతులు యాసంగిలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, పెసర, మినుముతోపాటు అక్కడక్కడ వరి సాగు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 1409 చెరువులుండగా.. గురువారం మధ్యాహ్నం నాటికి 183 చెరువులు నిండాయి. 374 చెరువుల్లో 75 నుంచి 100 శాతం మధ్యలో నీరు చేరింది. 432 చెరువుల్లో 50 నుంచి 75 శాతం, 293 చెరువుల్లో 25 నుంచి 50 శాతం, 127 చెరువుల్లో 25 శాతం మేర నీరు చేరింది..
కాకతీయ రాజులు తవ్విన చెరువులకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొచ్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో కనుమరుగైన చెరువులకు జీవం పోసింది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరించింది. గతంలో వరద కాలువలు ఆనవాళ్లు కోల్పోయి చెరువులోకి నీరుచేరే స్థితి లేదు. చెరువుల్లో పూడిక కూడా పేరుకుపోయింది. చెరువు కట్టలు సైతం పటిష్టంగా లేవు. చెరువు నిండితే తెగే పరిస్థితిలో ఉండేవి. కాని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువులు కొత్త శోభను సంతరించుకున్నాయి. చెరువుల్లో పూడికతీత పనులు, కట్టలను బలోపేతం చేయడం, వరద కాలువలకు మరమ్మతు చేయడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. గతంలో రోజులు తరబడి వర్షాలు కురిసినా చెరువుల్లోకి చుక్కనీరెళ్లని పరిస్థితి. ప్రస్తుతం కొద్దిపాటి వర్షం కురిసినా నేరుగా వరద చెరువుల్లోకి చేరుతున్నది. మిషన్ కాకతీయ ఫలితంగా ఖమ్మం జిల్లాలోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. అంతేకాదు, ఆయకట్టు రైతులు వానకాలం, యాసంగి రెండు పంటలు పండించుకుంటున్నారు. గతంలో బీళ్లుగా ఉన్న పొలాలు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి.