రైతు ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమ
కొనసాగుతున్న రైతుబంధు నగదు పంపిణీ
నేటి వరకు 1.74 లక్షల మందికి లబ్ధి
జోరందుకున్న సాగు పనులు
ఖమ్మం వ్యవసాయం, జూన్ 17 :రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు ఆత్మబంధువుగా నిలుస్తోంది.. కర్షకులను పెట్టుబడి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ‘రైతు బంధు’తో ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అదునుకు ముందే రైతులకు పెట్టుబడి సాయం అందజేసి వారి వెన్నుదన్నుగా నిలుస్తున్నది. కేవలం మూడురోజుల్లోనే రూ. 89,82,47,859 నగదును రైతుల అకౌంట్లలో జమ చేసింది. అన్నదాతల ఖాతాల్లో సర్కార్ పెట్టుబడి సొమ్ము జమ చేస్తుండడంతో అన్నదాతలు ఉత్సాహంగా సాగులోకి దిగుతున్నారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగు పనులు జోరందుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాగు రైతులకు వరుణుడు సహకరించడంతో వానకాలం సాగు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అన్నదాతల ఖాతాల్లో సర్కార్ పెట్టుబడి సొమ్ము ఎంత వేగవంగా జమ చేస్తున్నారో.. అదే తరహాలో సాగు కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానకాలం సీజన్కు సుమారు 3 లక్షల మంది రైతులకు రూ.362 కోట్లను పదిరోజుల వ్యవధిలోనే అందజేసేందకు సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అందుకు అనుగుణంగా సన్నా, చిన్న కారు రైతుల ప్రాధాన్యతా క్రమంలో నగదు జమ చేస్తున్నది. ప్రస్తుతం సాగుకు పెట్టుబడి అవసరాలు తోడుకావడంతో ఆయా గ్రామాల రైతులు బ్యాంకుల వద్దకు వెళ్లి జమైన రైతుబంధు సొమ్మును విత్డ్రా చేసుకుంటున్నారు. అనంతరం విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేందుకు నగరంలోని దుకాణాల వద్దకు క్యూ కడుతున్నారు. రెండురోజుల నుంచి మండల, జిల్లా కేంద్రాల్లో సాగు రైతుల రద్దీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే కొందరు రైతులు కొంతమేర విత్తనాలు కొనుగోలు చేయగా.. మిగిలిన రైతులు రెండు, మూడు రోజుల నుంచి విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి సుమారు 5.96 లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని జిల్లా వ్యవసాయశాఖ అంచనా. రుతుపవనాలు సకాలంలో వచ్చాయి. అవరమైన మేర విత్తనాలు, ఎరువులు అందుబాటులో లభిస్తున్నాయి. దీంతో ఈ నెల చివరి వరకు 50శాతం పైబడి సాగు పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది.
ముమ్మరంగా సాగు పనులు
పంటల పెట్టుబడికి సంబంధించి ప్రభుత్వం నగదును రైతుల అకౌంట్లలో జమ చేస్తుండడంతో ఆ ప్రభావం సాగు పనులపై స్పష్టంగా కనిపిస్తున్నది. మూడు రోజుల నుంచి రైతులు గ్రామాల్లో ఎక్కడ చూసినా.. సాగు పనుల్లో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తున్నది. జిల్లా వ్యవసాయశాఖ గణంకాల ప్రకారం.. సాగు విస్తీర్ణం పరిశీలిస్తే జిల్లా వ్యాప్తంగా 9,889 ఎకరాల్లో వరి నారునార్లు పోసుకోగా.. 153 ఎకరాల్లో వరినాట్లు వేసుకున్నారు. కేవలం 13ఎకరాల్లో కందిని విత్తుకోగా.. అంతర్ పంటగా మరో 50 ఎకరాల్లో సాగు చేశారు. పెసర 998, మినుము 4, వేరుశనగ 4, చెరకు మరో 555 ఎకరాల్లో రైతులు సాగు చేసుకోవడం జరిగింది. పత్తి 10,134 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 21,800 ఎకరాల్లో సాగు చేశారు. ఈ నెల చివరి వరకు నిర్దేశించుకొన్న లక్ష్యంలో సగానికిపైగా సాగు జరిగే అవకాశం ఉన్నదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.