నిబంధనలు పాటించకపోతే ఆస్పత్రులు సీజ్
రెమ్డెసివిర్, ఆక్సీజన్ కొరత లేదు
వారానికి 10 వేల ఇంజెక్షన్లు
ప్రైవేట్ ఆస్పత్రుల యాజమానుల సమావేశంలో మంత్రి పువ్వాడ
ఖమ్మం, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వైద్యం కోసం వచ్చినవారిని పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాల తీరుపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కన్నెర్ర చేశారు. కొవిడ్ పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల తీరు మారకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. రెమ్డెసివర్ ఇంజెక్షన్లను బ్లాక్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, వైద్యులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఫీజులు ఉండాలని ఆయన ఆదేశించారు.
కొవిడ్ నియంత్రణతో పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించబోమని, అవసరమైతే అటువంటి ఆస్పత్రులను సీజ్ చేసేందుకైనా వెనుకాడబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యం కోసం వచ్చే కొవిడ్ బాధితులను ఆర్థికంగా పీల్చి పిప్పి చేయాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సౌకర్యాలు, ఫీజులు ఉండాలని ఆదేశించారు. రూం రెంటుపై వస్తున్న ఆరోపణలు, సోషల్మీడియాలో వైరల్గా మారిన ఆస్పత్రికి బిల్లు అంశాలపై నగరంలోని సురక్ష ఆస్పత్రి యాజమాన్యాన్ని మంత్రి ప్రశ్నించారు. ఇది తమ పేరుతో ఎవరో రాసిన బిల్లు అని ఆస్పత్రి ప్రతినిధి సమాధానమిచ్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. మొత్తం వ్యవహారంపై పూర్తి విచారణ చేయాలని అక్కడే ఉన్న సీపీని ఆదేశించారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందజేస్తున్నప్పటికీ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వ కన్ను గప్పి నేరుగా కంపెనీల నుంచి ఇంజక్షన్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్నప్పుడు మళ్లీ ఈ తరహా ప్రయత్నాలు చేయడం వల్ల అనేక ఆరోపణలు, అపవాదులు వస్తున్నాయని అన్నారు. ఆక్సీజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు సంబంధించి అన్ని ప్రైవేట్ ఆస్పతుల్లో ఇక రోజువారీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు.
ఆస్పత్రుల్లో కొవిడ్ నిబంధనల అమలు తీరును పరిశీలించాల్సిందిగా నలుగురు అధికారులతో వేసిన కమిటీ ఎన్ని ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసిందని కమిటీ సభ్యుడైన టాస్క్ఫోర్స్ ఏసీపీ రామానుజాన్ని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటి వరకు చేయలేదని ఆయన చెప్పడంతో తక్షణమే ఆకస్మిక తనిఖీలు చేయాలని డీఎంహెచ్ఓ మాలతిని మంత్రి ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఆక్సీజన్ కొరత కూడా లేదన్నారు. రోజుకు 1500 చొప్పున వారానికి 10 వేల రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఖమ్మం జిల్లాకు రానున్నాయన్నారు. ఈ మేరకు హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డితో తాను చర్చించానని చెప్పారు. ఆస్పత్రుల యాజమానులు, వైద్యులు మానవత దృక్పథంతో కొవిడ్ బాధితులకు వైద్యం చేయాలని సూచించారు. వారి ప్రాణాలతో వ్యాపారం చేయడం సరికాదన్నారు. రెమ్డెసివిర్ ఘటనలు పునరావృతం అయితే ఆస్పత్రులను పర్మినెంట్గా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఖమ్మం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి సర్వే విస్తృతంగా కొనసాగుతుందన్నారు. సీపీ విష్ణు ఎస్ వారియర్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.