ప్రజలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
పెనుబల్లిలో 25 బెడ్ల ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: ఎమ్మెల్యే సండ్ర
పెనుబల్లి, మే 17: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పెనుబల్లి సీహెచ్సీలో 25 బెడ్లతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచామని, సీఎం చొరవతో హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డితో చర్చించి వాటిని సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఐసోలేషన్ వార్డు ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అందరి ఆరోగ్యమే లక్ష్యం: సండ్ర
అందరూ ఆరోగ్యంగా ఉండడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కరోనా పరిస్థితుల్లో అధ్యైర్య పడొద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వేంసూరు, సత్తుపల్లి మండలాల ప్రజల కోసం సత్తుపల్లిలో 35 బెడ్ల ఐసోలేషన్ వార్డు, కల్లూరు, పెనుబల్లి మండలాల ప్రజల కోసం పెనుబల్లిలో 25 బెడ్లతో ఐసోలేషన్ వార్డు సిద్ధంగా ఉన్నాయన్నారు. తల్లాడ ప్రజలు ఖమ్మం వెళ్లాలని కోరారు. అతి త్వరలోసత్తుపల్లిలో కూడా ఆక్సీజన్ ప్లాంట్ను సత్తుపల్లిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పెనుబల్లిలో ముక్కర భూపాల్ రెడ్డి, రిత్విక్ ప్లాంట్, తాళ్లూరి టెక్స్టైల్స్, సాయిచందు సీడ్స్ లాంటి దాతల ఉచిత భోజనం, మినరల్ వాటర్ అందించడానికి ముందుకొచ్చారన్నారు. వారందరినీ అభినందిస్తున్నట్లు చెప్పారు. డీసీహెచ్ఓ వెంకటేశ్వర్లు, జడ్పీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ చెక్కిలాల మోహన్రావు, వైద్యాధికారి రమేశ్, సర్పంచ్లు, తావూనాయక్, భూక్యా పంతులి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మందడపు అశోక్కుమార్, సీడీసీ చైర్మన్ గోపాల్రెడ్డి, ఎంపీటీసీ చీపి లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.