విడతల వారీగా గోదాములకు..
జిల్లాలో నాలుగుగోదాముల్లో నిల్వ
పర్యవేక్షిస్తున్న గ్రామీణాభివృద్ధి శాఖ
భద్రాద్రి జిల్లా లక్ష్యం 3.66 లక్షలు
ఇప్పటికే చేరుకున్నవి 2.05 లక్షలు
ఖమ్మం జిల్లా లక్ష్యం 4.98 లక్షలు
ఇప్పటికే చేరుకున్నవి 95 వేలు
ఖమ్మం, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బతుకమ్మ చీరెలు చేరుకున్నాయి. తెలంగాణ మహిళలు ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే పండుగ బతుకమ్మ. తెల్లరేషన్కార్డులో పేరు కలిగి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ కానుకగా చీరె అందించడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీగా వస్తోంది. బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తుండడంతో జిల్లాకు బతుకమ్మ చీరెలను ప్రభుత్వం పంపించింది. దశల వారీగా ఈ చీరెలు ఉమ్మడి జిల్లాకు చేరుకుంటున్నాయి. గోదాముల్లో వీటిని భద్రపరుస్తున్నారు. బతుకమ్మ పండుగకు కొద్దిరోజుల ముందు నుంచి రేషన్షాపుల వారీగా వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
చేనేత, జౌళి శాఖ ఈ బతుకమ్మ చీరెలను తయారు చేయించింది. జిల్లా లక్ష్యం 4,98,305 చీరెలకు గాను ఇప్పటికే 94,840 చీరెలు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ చీరెలను నిల్వచేసేందుకు నాలుగు గోడౌన్లను గుర్తించారు. ఖమ్మంలోని వరంగల్ క్రాస్రోడ్లోని తెలంగాణ గిడ్డంగుల సంస్థ గోడౌన్లో 2 లక్షలు, వైరా గోడౌన్లో లక్ష, మధిర గోడౌన్లో లక్ష, నేలకొండపల్లి గోడౌన్లో లక్ష చొప్పున చీరెలను నిల్వచేయాలని నిర్ణయించారు. నూతనంగా మంజూరైన రేషన్కార్డుల్లోని మహిళలకు సైతం పంపిణీ చేయనున్నారు. ఏ రేషన్షాపునకు ఎన్ని చీరెలు పంపించాలన్న అంశంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మండలస్థాయిలో తహసీల్దార్ పర్యవేక్షణలో రేషన్షాపుల వారీగా పంపిణీ చేయనున్నారు. పంచాయతీ కార్యదర్శి, రేషన్షాపు డీలర్, గ్రామ సమాఖ్య ప్రతినిధి, గ్రామానికి చెందిన వివిధ శాఖల సిబ్బంది కమిటీగా ఏర్పడి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొత్తం 3,66,088 చీరెలు రావాల్సి ఉండగా ఇప్పటికే 2,05,000 చీరెలు జిల్లాకు చేరుకున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గానికి 57 వేలు, భద్రాచలం నియోజకవర్గానికి 14 వేలు, పినపాక నియోజకవర్గానికి 6 వేలు, జూలూరుపాడుకు 10 వేలు, ఇల్లెందు నియోజకవర్గానికి 40 వేల చీరెలు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని జిల్లా అధికారులు గోదాముల్లో నిల్వచేశారు. అక్టోబర్ మొదటి వారంలో ఈ చీరెల పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రావాల్సిన 8,66,088 చీరెలు ఈ నెలాఖరుకు చేరుకోనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 8 లక్షల తెల్లరేషన్కార్డులున్నాయి. బతుకమ్మ చీరెల పర్యవేక్షణ బాధ్యతను ఈసారి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చేపట్టారు. బతుకమ్మ చీరెలు గోదాముల్లో భద్రపర్చిన తీరును ఖమ్మం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విద్యాచందన బుధవారం నేలకొండపల్లి గోదాములో పరిశీలించారు.
లక్ష చీరెలొచ్చాయి..
ఖమ్మం జిల్లాకు రావాల్సిన 5 లక్షల బతుకమ్మ చీరెలకు గాను ఇప్పటికే దాదాపు లక్ష చీరెలు చేరుకున్నాయి. వీటిని జిల్లాలోని నాలుగు గోదాముల్లో భద్రపరిచాం. మిగిలిన చీరెలు కొద్దిరోజుల్లో రానున్నాయి. వీటిని భద్రపర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే పంపణీ ప్రారంభమవుతుంది. గోదాముల నుంచి మండల కేంద్రాలకు, మండలాల నుంచి రేషన్షాపులకు పంపుతాం..
-విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం