ఖమ్మం నగరంలో 15 కేంద్రాలు, భద్రాద్రిలో 18 కేంద్రాలు
నిమిషం నిబంధన అమలు.. సెంటర్లలో ద్రావణం పిచికారీ
ఖమ్మం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూలై 16: తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్- 2021)ను శనివారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష జరగనుంది. ఖమ్మం జిల్లా 15, భద్రాద్రి జిల్లాలో 18 కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తుంచనున్నారు. పరీక్షల కోసం నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిమిషం నిబంధన అమలు చేస్తుండడంతో గంట ముందు నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు.
పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఖమ్మంలోని 15 కేంద్రాల్లో 3,777 మంది విద్యార్థులు, భద్రాద్రిలో 18 కేంద్రాల్లో 3,928 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కేంద్రాల్లో ఇప్పటికే సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రతి కేంద్రానికి ఒక పర్యవేక్షకుణ్ని నియమించారు. ఖమ్మంలో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పాలిసెట్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. పాలిసెట్ పరీక్ష నిర్వహణపై 15 కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో శుక్రవారం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో కో ఆర్డినేటర్ రత్నప్రసాద్ మాట్లాడుతూ కొవిడ్ నేపథ్యంలో పాలిసెట్ కేంద్రాల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇన్విజిలేషన్ నిర్వహించే వారు సెల్ఫోన్లు వినియోగించొద్దని సూచించారు. విద్యార్థులను గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించ్దొదని స్పష్టం చేశారు. నిమిషం నిబంధన అమలు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు మాస్కు ధరించి రావాలని, హాల్టికెట్, హెచ్బీ పెన్సిల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు భౌతికదూరం పాటించేలా నెంబర్లు కేటాయించినట్లు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నాగముని నాయక్ తెలిపారు.
ఖమ్మంలో పరీక్ష కేంద్రాలివే..
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్బీజీఎన్ఆర్లో మూడు కేంద్రాలతోపాటు డేర్ ఇంజినీరింగ్ కళాశాల, ఆర్జేసీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, నయాబజార్ జూనియర్ కళాశాల, శాంతినగర్ హైస్కూల్, కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాల, నిర్మల్ హృదయ్ స్కూల్, డీఆర్ఎస్ డిగ్రీ కళాశాల, వికాస్ డిగ్రీ కళాశాల, హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
కొత్తగూడెంలో పరీక్షా కేంద్రాలివే..
కొత్తగూడెంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, చుంచుపల్లి హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, సింగరేణి మహిళా జూనియర్ కళాశాల, సింగరేణి ఉన్నత పాఠశాల, అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్ర డిగ్రీ, పీజీ కళాశాల, సత్తుపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల సత్తుపల్లి, మదర్ థెరిసా ఇంజినీరింగ్ కాలేజీ, సాయి స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీ, భద్రాచలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, టీటీడబ్ల్యూఆర్జేఆర్లలో విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.