నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మంచుకొండ గ్రామంలో ఆకస్మిక పర్యటన
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం
కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డీపీవోకు ఆదేశం
రఘునాథపాలెం, జూన్ 16: గ్రామాల్లో ‘పల్లె ప్రగతి’ పరుగులు పెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిఢవిల్లాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో జరగాలని, ప్రతి పల్లే.. పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా ఉండాలని ఆదేశించారు. పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమం విరివిగా చేపట్టాలని సూచించారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో విస్తృత పర్యటన చేపట్టిన మంత్రి.. పల్లెప్రగతిలో చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పల్లెలో దేశానికి పట్టుకొమ్మలని జాతిపిత చెప్పిన మాటలను నమ్మిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గ్రామాల సమగ్రాభివృద్ధికి ‘పల్లెప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిఢవిల్లాలన్నారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో మంత్రి అజయ్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ కాలనీ పురవీధుల గుండా పర్యటించి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రోడ్ల వెంట నిర్లక్ష్యంగా పడేసిన చెత్త కుప్పలు, రాళ్లకుప్పలను చూసి అధికారులు, ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. గ్రామ కార్యదర్శి రాంకీ నిర్లక్ష్యపు సమాధానం చెబుతుండడంతో వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి డీపీవో ప్రభాకర్రావును ఆదేశించారు. గ్రామాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుంటే గ్రామస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరించారు. ఇటీవల సీఎం కేసీఆర్ గ్రామస్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, పాలకవర్గ సభ్యులతో అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పల్లెప్రగతి పనులపై సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో జరగాలని, ప్రతి పల్లె.. పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదకరంగా ఉండాలని ఆదేశించారు. పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదిలేదన్నారు. గ్రామంలో విస్తృత పర్యట చేపట్టిన మంత్రి పల్లెప్రగతిలో చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారిశుధ్య కార్యక్రమాలపై ఆరా..
మంచుకొండ పర్యటనలో భాగంగా మంత్రి అజయ్కుమార్ గ్రామంలో పారిశుధ్య పనుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. చెత్త సేకరణ ప్రతి నిత్యం జరుగుతుందా? చెత్తను సేకరించేందుకు పారిశుధ్య కార్మికులు రోజూ ఇంటి ముందుకి వస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అంగన్వాడీ భవనం అసంపూర్తిగా కనిపించడాన్ని గమనించిన మంత్రి.. పంచాయతీరాజ్ అధికారులపై మండిపడ్డారు. నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపడతానని అన్నారు. పనుల్లో నిర్లక్ష్యం ఉంటే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీపీవో ప్రభాకర్రావు, ఎంపీడీవో అశోక్కుమార్, ఎంపీవో శ్రీదేవి, ఎంపీపీ గౌరి, జడ్పీటీసీ ప్రియాంక, సర్పంచ్ విజయ, ఉప సర్పంచ్ రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మందడపు నర్సింహారావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మందడపు సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు భుక్యా లక్ష్మణ్నాయక్, బోడా సైదులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
అమ్మా.. నీకు కేసీఆర్ పింఛనొస్తందా?
ఓ అవ్వను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి పువ్వాడ
‘అమ్మా.. నీకు కేసీఆర్ పింఛనొస్తందా?’ అంటూ ఓ అవ్వను ఆప్యాయంగా పలుకరిస్తూ ఆమె దగ్గరకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు మంత్రి పువ్వాడ అజయ్కుమార్. బుధవారం మంచుకొండ పర్యటిస్తున్నప్పుడు తగరం రాధమ్మ అనే వృద్ధురాలు తన ఇంటి ముందు బల్లపై దిగాలుగా కూర్చొని ఉండడాన్ని గమనించిన మంత్రి అజయ్.. ‘అమ్మా..’ అంటూ దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఆమె పక్కనే కూర్చొని ముచ్చటించారు. ‘కేసీఆర్ పింఛన్ వస్తుందా?’ అంటూ వాకబు చేశారు. ‘లేదు బిడ్డా.. బోధకాలుతో చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడ్తున్నా..’ అంటూ ఆమె ఇచ్చిన సమాధానానికి చలించిపోయిన మంత్రి.. వెంటనే పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు.