గ్రామాల్లో పారిశుధ్యం పక్కాగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్సులో మంత్రి ఎర్రబెల్లి
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: సీఎస్
కొత్తగూడెం/ మామిళ్లగూడెం, జూన్ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతిలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ సంయుక్తంగా ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణ, పారిశుధ్య పనుల నిర్వహణ, పల్లె ప్రగతి పెండింగ్ పనులు, ఏడో విడత హరితహారానికి సన్నద్ధత, నూతన సమీకృత పాలనాధికారుల ప్రాంగణంలో మొక్కల పెంపకం, అడవుల పునరుద్ధరణ చర్యలు వంటి అంశాలపై బుధవారం వరంగల్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, హైదరాబాద్ నుంచి సీఎస్ సోమేశ్కుమార్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతి ప్రారంభమై ఏడాదిన్నర కావస్తోందని, ఇప్పటి వరకు చక్కని ఫలితాలు సాధించిందని అన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు అభినందనలు తెలిపినట్లు చెప్పారు. అదే స్ఫూర్తితో మరింత శ్రమించి ఈ సారి కూడా పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని సూచించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక పర్యటన చేయనున్నారని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో వైకుంఠధామాలు పూర్తి కాలేదన్నారు. అన్నింటినీ 15 రోజుల్లో పూర్తి చేసి విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.
గ్రామసభలకు ఎంపీవోలు, డీపీవోలు, అడిషనల్ కలెక్టర్లు హాజరు కావాలని, గ్రామ అభివృద్ధికి చేసిన ఖర్చుల వివరాలు సభ ముందు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్లకు వాహనాలు సమకూర్చి, బడ్జెట్ కేటాయించినందున కొంచమైనా ఫలితం కన్పించాలన్నారు. వారంతా ఎక్కువ గ్రామాలను సందర్శించాలని, నెలలో కొన్ని రోజులు తప్పని సరిగా పల్లె నిద్ర చేయాలని, ఉదయాన్నే గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం తదితర విషయాలు గమనించి అక్కడికి అక్కడే సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సర్పంచ్లు, కార్యదర్శులు, ఎంపీవోలపై ఫిర్యాదులు ఉంటే షోకాజ్ నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని, సమస్యలు పరిష్కారం కోసం వారికి నిధులు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. జిల్లా అధికారులు నిరంతరం పర్యటించాలని, పల్లె నిద్ర కార్యక్రమాలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా నుంచి కేఎంసీ కమిషనర్ అనురాగ్జయంతి, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్, డీఆర్డీవో విద్యాచందన, డీఎఫ్వో ప్రవీణ, డీపీవో ప్రభాకర్రావు పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్, డీఎఫ్వో రంజిత్, డీపీవో రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు సంపత్, శ్రీకాంత్, శ్రీనివాసరెడ్డి, నాగప్రసాద్ పాల్గొన్నారు.