వరి సాగుకు ఫుల్ స్టాప్
భద్రాద్రి జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న పత్తి విస్తీర్ణం
ఈ ఏడాది ఏకంగా 2.55 లక్షల ఎకరాల్లో సాగు
ఆశాజనకంగా పూత, కాత
కొత్తగూడెం, సెప్టెంబర్ 15;అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు పెంచుతుండడం.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు వస్తుండడంతో రైతులు పత్తి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గడిచిన మూడేళ్లలో కర్షకులు ఏటా లక్ష ఎకరాలకుపైగా పత్తి సాగు చేయగా.. ఈ ఏడాది 2.55 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.5,726 పలికింది. దీంతో ఈ సారి అంచనాకు మించి సాగు చేస్తున్నారు.
పత్తి పంట రైతుల పాలిట సిరుల పంటగా మారుతున్నది. సకాలంలో వర్షాలు కురవడం, చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడంతో సాగుకు రంది లేకుండాపోయింది. వరి సాగును తగ్గించి పత్తి సాగు మరింత పెంచాలనే ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతు ‘తెల్ల బంగారం’ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఐదేండ్ల నుంచి భద్రాద్రి జిల్లాలో పత్తి సాగు ఏటికేడు పెరుగుతున్నది. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులకు ఆస్కారం ఉండడంతో పత్తి సాగు పెరుగుతున్నది.
ఏటికేడు పెరుగుతున్న విస్తీర్ణం..
ఏటా ప్రభుత్వం గిట్టుబాటు ధరలు పెంచుతుండడంతో రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు సకాలంలో ప్రభుత్వం నుంచి రైతుబంధు, బ్యాంకుల నుంచి పంట రుణాలు అందుతుండడం రైతులకు కలిసి వస్తున్నది. వ్యవసాయశాఖ అధికారులు రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను సమకూర్చడంతో ఇబ్బందులు తప్పాయి. రైతు రారాజు కావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది.
అంచనాలకు మించి సాగు..
పత్తిలో అధిక దిగుబడులు రావడంతో రైతులు ఈ ఏడాది పత్తి సాగును భారీగా పెంచారు. భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది విస్తారంగా పత్తి సాగవుతున్నది. గడిచిన మూడేళ్లలో ఏటా లక్ష ఎకరాలకు పైగా పత్తి సాగు చేసిన రైతులు ఈ ఏడాది ఏకంగా 2.55 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాకు రూ.5,726 ఉంది. గతేడాది రూ.5,515 ఉన్నప్పటికీ రైతులు లాభాలను చూశారు. ఈసారి మరింత లాభాలు సాధించే అవకాశం ఉన్నది.
పత్తితో లాభాలు ఉన్నాయి
నేను గతేడాది పది ఎకరాల్లో పత్తి చేశాను. ఈ ఏడాది 15 ఎకరాలు చేస్తున్నాను. ఈ సారి కాపు బాగుంది. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా. ఈ సీజన్లో సమయానికి వర్షాలు కురిశాయి. వ్యవసాయశాఖ అధికారుల సలహాలతో సాగు చేస్తున్నాం. వరిని తగ్గించి పత్తి సాగును పెంచాను. గతేడాది మంచి లాభాలను ఆర్జించా. ఈ ఏడాది కూడా మంచి లాభం వస్తుందనుకుంటున్నా.
-రామ్మోహన్రావు, రైతు, కొత్త అంజనాపురం
ఈ సారి కాపు బాగుంది..
నేను గతేడాది ఏడెకరాల్లో పత్తి సాగు చేశాను. ఈ ఏడాది 10 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. ఇప్పుడు పంట కాతకు వచ్చింది. ఇక కలుపు తీయించి పురుగు మందులు చల్లితే చాలు. పూత ఎదుగుతుంది. విత్తనాలు వేసే దశలోనే సరిపడా వర్షాలు కురవడం కలిసి వచ్చింది. ఇప్పటికి ఆశించిన వర్షాలు వచ్చాయి. మంచి దిగుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. సాగు ఆశాజనకంగా ఉన్నది.
-మందభాస్కర్రావు, రైతు, సింగభూపాలెం
సాగుపై అవగాహన కల్పిస్తున్నాం..
ఐదేళ్లుగా జిల్లా రైతులు పత్తి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది అంచనాకు మించి సాగు చేస్తున్నారు. ఇప్పటికే 99 శాతం అంచనా పూర్తయింది. వరి తగ్గించి పత్తి వేయాలనే సూచనలను రైతులు పాటిస్తున్నారు. పత్తి మొక్కల మధ్య అంతర పంటగా కొందరు కంది, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.