దుమ్ముగూడెం, పర్ణశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రి, పీహెచ్సీల్లో రాష్ట్ర వైద్యాధికారుల తనిఖీ
దుమ్ముగూడెం, సెప్టెంబరు 15 : ఏజెన్సీ మండలాల్లో బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, మాతాశిశు సంరక్షణ విభాగం జేడీలు పద్మజ, సుధీర పర్యటించారు. దుమ్ముగూడెం పీహెచ్సీని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలపై వైద్యుడు బాలాజీనాయక్ను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి జిల్లాలోనే దుమ్ముగూడెం వైద్యశాల ప్రసవాల్లో మొదటి స్థానంలో ఉండడంతో వైద్యులు, వైద్యసిబ్బందిని అభినందించారు. ఏజెన్సీ కావడంతో మారుమూల గిరిజనులు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులుగా ఉందన్నారు. వైద్యసిబ్బంది గ్రామాలను సందర్శించి రోగుల వివరాలను తెలుసుకుంటూ ఉండాలన్నారు. కార్యక్రమంలో పర్ణశాల పీహెచ్సీ వైద్యులు మణిదీప్, జిల్లా ప్రోగ్రామ్ అధికారి సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.
పర్ణశాల పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ..
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, మాతా శిశుసంరక్షణ విభాగం జాయింట్ డైరెక్టర్లు పద్మజ, సుధీర పర్ణశాల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రసూతి వైద్యసేవలు, పిల్లల టీకాలు, వార్డులను తదితర రికార్డులను పరిశీలించారు. గిరిజన గ్రామాల్లో మహిళలకు రక్తహీనత, మాతాశిశు మరణాల రేటును తగ్గించాలని వైద్యసిబ్బందికి సూచించారు.
రామయ్య సేవలో రాష్ట్ర వైద్యశాఖ బృందం
పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ల బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఆలయ పూజారలు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. బృందానికి అర్చకులు భార్గవ చార్యులు, నర్సింహాచార్యులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ సమీపంలోని పంచవటిని దర్శించుకుని ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు.