ఖమ్మం, సెప్టెంబర్15,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ వేంసూరు : తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి (టీటీడీ) సభ్యుడిగా ఖమ్మం జిల్లావాసి బండి పార్థసారథిరెడ్డికి రెండోసారి అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2019లో టీటీడీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సన్నిహితుడిగా, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆత్మీయుడిగా పేరొందిన హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డికి అవకాశం లభించింది. గత పాలకవర్గం పదవీ కాలం పూర్తి కావడంతో తెలంగాణ నుంచి టీటీడీ బోర్డు సభ్యులుగా ఎవరికి లభిస్తుందన్న అంశంపై ఇటీవల సర్వత్రా చర్చ జరిగింది. ఆ అవకాశం బండి పార్థసారథిరెడ్డికి లభించింది. ఆయన స్వగ్రామం వేంసూరు మండలంలోని కందుకూరు గ్రామం. తల్లిదండ్రులు బండి శ్రీనివాసరెడ్డి, సోమకాంతమ్మ. పార్థసారథిరెడ్డి 6 మార్చి 1954లో జన్మించారు. ఇంటర్మీడియట్ సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాలలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్డీ పూర్తి చేశారు. 1993లో హెటిరో డ్రగ్స్ను స్థాపించి వ్యాపారవేత్తగా ఎదిగారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన పార్థసారథిరెడ్డి సత్తుపల్లి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సత్తుపల్లి మండలంలో ఇంజినీరింగ్ కళాశాల, కందుకూరులో సాయిబాబా దేవాలయం నిర్మించారు. కొవిడ్ సమయంలో 2 వేల మందికి పైగా గ్రామస్తులకు వ్యాక్సినేషన్ అందించారు.