మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ అశ్వారావుపేటలో ప్రారంభం
అప్పారావుపేటలో రెండో ఫ్యాక్టరీ
పామాయిల్ సాగుకు మూడేండ్ల పాటు పెట్టుబడి ప్రోత్సాహకం
ఎకరాకు రూ.36 వేల చొప్పున సహాయం
మరింత విస్తరించే అవకాశం
మంత్రివర్గ నిర్ణయంపై సర్వత్రా హర్షం
దమ్మపేట, జూలై 15 :ఆయిల్పాం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. రానున్న 2022- 23 సంవత్సరంలోగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేపట్టేలా రైతులను చైతన్యపరచాలని నిర్ణయించింది. ఆయిల్పాం పంట నాలుగేండ్లకు చేతికి రానున్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వారికి పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీ అందజేయాలని నిర్ణయించడంతో పామాయిల్ సాగు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట మండలాలు రాష్ట్రంలోనే పామాయిల్ సాగుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కొందరు రైతులు తొలినాళ్లల్లో ఒడిదుడుకులు ఎదుర్కొని సాగులో విజయం సాధించారు. మరికొందరు పెరిగిన పామాయిల్ తోటలను తొలగించారు. ప్రతికూల పరిస్థితులు తట్టుకొని ఫలితాలు సాధించడంతో మిగిలిన రైతులు తిరిగి పామాయిల్ సాగు చేసేందుకు ముందుకొచ్చారు. టీఎస్ ఆయిల్ఫెడ్ పరిధిలోని మండలాల్లో 2007 వరకు కేవలం 2,351 హెక్టార్లలో మాత్రమే ఆయిల్పాం సాగైంది. ప్రస్తుతం 13,128 హెక్టార్లకు పంట విస్తరించింది. అంతేకాదు, అశ్వారావుపేట, అప్పారావుపేటలో పామాయిల్ పరిశ్రమలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆయిల్పాంను ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం మరింత పెరగనున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా సాగు తీరు, విస్తీర్ణం, పామాయిల్ పరిశ్రమల ఏర్పాటుపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
2,351 నుంచి 13,128 హెక్టార్లకు..
భద్రాద్రి జిల్లాలోని టీఎస్ ఆయిల్ఫెడ్ పరిధిలోని మండలాల్లో 2007వ సంవత్సరం వరకు కేవలం 2,351 హెక్టార్లలో మాత్రమే పామాయిల్ సాగు చేసేది. 2007 నుంచి 2014 సంవత్సరం వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే నాటికి ఏడేళ్ల కాలంలో 8,022 హెక్టార్లలో పామాయిల్ విస్తరించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్లలో 5,105 హెక్టార్లలో పామాయిల్ కొత్తగా సాగైంది. ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో మొత్తం 13,128 హెక్టార్లలో సాగవుతోంది.
రెండో పరిశ్రమ అప్పారావుపేటలో..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో మొదటి, రెండో పామాయిల్ పరిశ్రమ అప్పారావుపేటలో రూ.100 కోట్లతో అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దు కున్నది. ఈ పరిశ్రమ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 కోట్లను టీఎస్ ఆయిల్ఫెడ్కు అందజేశారు. ఈ కర్మాగారంలో ఆయిల్ దిగుబడి అశ్వారావుపేట పరిశ్రమను మించి పోయింది. రైతులకు పామాయిల్ గెలలకు చెల్లించే ధరకు అప్పారావుపేట కర్మాగారమే బెంచ్మార్క్గా కొనసాగుతున్నది. కర్మాగారంలో ఆయిల్ రికవరీ ఆధారంగా తెలంగాణ రైతులకు దేశంలోనే అత్యధిక ధర దక్కుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో వేగంగా విస్తరణ..
కేసీఆర్ ప్రభుత్వం సాగుకు నాణ్యమైన విద్యుత్, రైతులకు సౌకర్యవంతంగా పరిశ్రమలు, ధరలు వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. దీంతో వేగంగా పామాయిల్ సాగు విస్తరిస్తున్నది. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో సుమారు పదివేల ఎకరాలకు పామాయిల్ మొక్కలు కావాలని దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్థిరమైన ఆదాయం.. ప్రకృతి ప్రతికూలతలు తట్టుకునే ఈ ప్రాంతం పామాయిల్ సాగు యావత్ తెలంగాణ రైతాంగాన్నే ఆకర్షిస్తోంది. పామాయిల్ సాగును క్షేత్రస్థాయి అధ్యయనం చేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు వస్తున్నారు.
తొలి పామాయిల్ పరిశ్రమ..
2004లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న జలగం వెంకటరావు కృషితో తెలంగాణలోని అశ్వారావుపేటలో తొలి పామాయిల్ పరిశ్రమ ఏర్పాటైంది. తొలుత గంటకు ఐదు మెట్రిక్ టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ప్రారంభమైన పరిశ్రమ 30 మెట్రిక్ టన్నుల వరకు దశలవారీగా విస్తరించింది. పామాయిల్ పరిశ్రమ ఏర్పాటు చేయకముందు వరకు కేవలం 2,351 హెక్టార్లకే పరిమితమైన పామాయిల్ పంట విస్తీర్ణం పుంజుకున్నది. పరిశ్రమ ఏర్పాటైన కొద్దికాలంలోనే పెదవేగి పరిశ్రమను మించి ఓఈఆర్ (ఆయిల్ ఎక్షాట్రాక్షన్ రేట్) దిగుబడి పెరిగింది. నాటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రైతులు పండించిన పామాయిల్ గెలలకు ధర చెల్లించడానికి బెంచ్ మార్కుగా అశ్వారావుపేట పరిశ్రమ మారింది. సామర్థ్యానికి మించి పామాయిల్ గెలల ఉత్పత్తి పెరగడంతో రెండో పరిశ్రమ అవసరం ఏర్పడింది.
కేసీఆర్ ప్రోత్సాహంతోనే
ఒక్క ఫ్యాక్టరీతో రైతులు ఇబ్బందులు పడేవారు. దీంతో పామాయిల్ సాగుకు కేరాఫ్గా ఉన్న దమ్మపేట మండలం అప్పారావుపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో మరో ఫ్యాక్టరీని నిర్మించాం. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రాంతంలో పామాయిల్ సాగు మరింత విస్తరించింది. రైతులకు సరైన ధర రావడంలో కీలక భూమిక పోషించా. సాగుబడిలో రైతులు ఆర్థికంగా ఎదిగారు.