హరితహారాన్ని పండుగలా జరుపుకోవాలి
పిల్లలు, పెద్దలు ఇందులో భాగం కావాలి
కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే వనమా
సింగరేణి గౌతంఖని ఓసీలో హరితహారం
రామవరం, జూలై 15: భద్రాద్రి జిల్లాను హరిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా గౌతంఖని ఓపెన్కాస్ట్లో సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్.చంద్రశేఖర్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని ఒక కార్యక్రమంలా కాకుండా పండుగలా జరుపుకోవాలని సూచించారు. పిల్లలు, పెద్దలు, ప్రజాప్రతినిధులు ఇందులో భాగమై విజయవంతం చేయాలని కోరారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలనే నినాదంతో సింగరేణి సంస్థ విరివిగా మొక్కలు నాటుతోందని, సంస్థ కార్మికులు, అధికారులు హరితహారంలో పాల్గొని ఆదర్శంగా నిలిచారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వృక్షో రక్షతి.. రక్షితః అనే నినాదంతో మొక్కలు నాటితే అవి వృక్షాలుగా మారి భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సింగరేణి డైరెక్టర్ (పా) బలరాం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పచ్చదనానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. పచ్చదనాన్ని పెంచడంలో సింగరేణి ముందుంటుందన్నారు. సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 50 లక్షలు మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇన్చార్జి జీఎం ఆర్.నారాయణరావు, జీకేవోసీ పీవో వెంకటరాంరెడ్డి, మేనేజర్ కరుణాకర్రావు, ఎస్టేట్ జీఎం సుభాని, ఏరియా ఇంజనీర్ రఘురామిరెడ్డి, , సివిల్ డీజీఎం సూర్యనారాయణ, ఎస్ఎస్వో రమణారెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్, 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బాదావత్ శాంతి, పెనగడప సర్పంచ్ మాలోత్ కళావతి, టీబీజీకేఎస్ నాయకులు గోపు కుమార్, చెరిపెల్లి నాగరాజు, చిరంజీవి, చుంచుపల్లి మండల అధ్యక్షుడు అబ్దుల్ ఉమర్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎస్ఆర్ నిధులు ఇప్పించండి
కొత్తగూడెం, పాల్వంచలను జంట పట్టణాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎస్ఆర్ నిధుల కింద రూ.10 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్లను కోరారు. డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం స్పందిస్తూ సింగరేణి సీఎండీకి ఈ విషయాన్ని తెలియజేస్తే సమస్య పరిష్కారం అవుతుందని, సీఎస్ఆర్ నిధులను విడుదల చేస్తారని అన్నారు.