తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత
పర్ణశాల వద్ద స్వల్పంగా పెరిగిన గోదావరి
మత్తడి దుంకుతున్న చెరువులు
చెక్డ్యాంలు, జలాశయాలకు జలకళ
నమస్తే నెట్వర్క్, జూలై 14 : ఉపరితల ఆవర్తన ప్రభావంతోపాటు, కొనసాగుతున్న అల్పపీడనంతో ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన రెండు, మూడు రోజుల నుంచి దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లావ్యాప్తంగా సరాసరి 28.4 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది. అత్యధికంగా మధిర మండలంలో 63 మి.మీ వర్షపాతం నమోదైంది. అదే విధంగా సత్తుపల్లి మండలంలో 82.4 మి.మీ, కొణిజర్ల మండలంలో 53.4 మి.మీ, ఖమ్మం అర్బన్ మండలంలో 44.2 మి.మీ, ఏన్కూరు మండలంలో 40 మి.మీ, ఖమ్మం రూరల్ మండలంలో 43.8 మి.మీ, సింగరేణి మండలంలో 38.2 మి.మీ, వేంసూరు మండలంలో 30.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్లోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరొచ్చి చేరుతున్నది. కొండవాగులు పొంగుతున్నాయి. అటవీ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. తాలిపేరు రిజర్వాయర్లోకి ఊహించనిరీతిలో వరద నీరొచ్చి చేరడంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి విడుదల చేశారు. తేగడవద్ద ఉన్న కాజ్వే నీట మునిగింది.
పర్ణశాల వద్ద గోదావరి బుధవారం స్వల్పంగా పెరిగింది. మండలంలో చిన్నగుబ్బలమంగి వాగు, సీతవాగుతోపాటు చిన్న చిన్న వాగులు, చెరువులు వర్షపు నీటితో నిండాయి. అశ్వారావుపేట మండలంలో చెరువులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వెంకమ్మ చెరువు అలుగు రెండు అడుగుల ఎత్తు ప్రవహిస్తున్నది. వాగొడ్డుగూడెం వాగు లోలెవల్ వంతెన పైనుంచి ఐదు అడుగుల మేర ప్రవహిస్తున్నది. దీంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొణిజర్ల మండలంలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నిండిపోయాయి. తీగలబంజరలోని పగిడేరు, అంజనాపురం సమీపంలో నిమ్మవాగు ఉధృతంగా ప్రవహించింది. పల్లిపాడు నుంచి ఏన్కూరుకు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.