నేటి నుంచి సాగునీరు విడుదల: వైరా ఎమ్మెల్యే
వైరా, జూలై 14: వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు కుడి, ఎడమ కాలువల ద్వారా గురువారం సాగర్ నీటిని విడుదల చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. సాగర్నీరు విడుదల గురించి ఐబీ అధికారులు, రైతు సంఘం నాయకులతో వైరాలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో రైతులు రెండేళ్లుగా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు పంటలు పండించిన ఘనత దక్కడం సంతోషంగా ఉందన్నారు. వైరా రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా విడుదలయ్యే నీటిని రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిత్యం పర్యవేక్షించాలని ఐబీ అధికారులకు సూచించారు. ఐబీ ఈఈ శ్రీనివాసాచారి, డీఈ శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, దొడ్డా పుల్లయ్య, తాతా రంగారావు, ఎంపీపీ వేల్పుల పావని, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, పీఏసీఎస్ చైర్మన్ గాలి శ్రీనివాసరావు, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యుడు మచ్చా నరసింహారావు, వ్యవసాయశాఖ అధికారి బాబురావు, ఏవో పవన్కుమార్, జడ్పీకో ఆప్షన్ సభ్యుడు ఎస్కే లాల్మహ్మద్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు సాదం రామారావు, పసుపులేటి మోహన్రావు, చల్లా సతీశ్ తదితరులు పాల్గొన్నారు.