భద్రాచలం, అక్టోబర్ 13: వ్యవసారంగానికి అన్యాయం చేసే రైతు చట్టాలతో దేశానికే ముప్పు వాటిల్లుతుందని, కేంద్ర ప్రభుత్వం అనైతికంగా నల్ల చట్టాలను తీసుకువచ్చిందని సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. భద్రాచలంలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులతో కలిసి బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సంక్షోభ సమయంలో అన్నం పెట్టిన రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. రైతులకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ‘రైతన్న’ సినిమా తీశానని, ప్రతిఒక్కరూ సినిమా చూసి ఆదరించాలని కోరారు. వామపక్షాల నాయకులు ఎంబీ నర్సారెడ్డి, మర్లపాటి రేణుక, భీమవరపు వెంకటరెడ్డి పాల్గొన్నారు.