ఉద్యాన పంటల సాగులో ఆధునిక విధానం
రైతుల్లో పెరుగుతున్న ఆసక్తి
రాయితీలతో ప్రోత్సహిస్తున్న సర్కార్
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి
అశ్వారావుపేట, సెప్టెంబర్ 13; ఉద్యాన పంట సాగులో రైతులు మల్చింగ్ విధానానికి మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే మల్చింగ్ విధానంతో రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతున్నది. కలుపు నివారణకు ఈ పద్ధతి ఎంతో తోడ్పడుతుంది. మొక్కకు అవసరమైన సూర్యరశ్మి, ఎరువులు అందుతాయి. ఈ మల్చింగ్ విధానంలో ఉద్యాన పంటలను సాగు చేయాలనుకునే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ ఏడాది 100 హెక్టార్లలో మల్చింగ్ సాగుకు ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. రాయితీ మంజూరు కోసం ఉద్యానాధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి..
విత్తు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పంటలపై పెట్టుబడి పెట్టి ఆర్థిక నష్టపోతున్నారు. పెట్టుబడి అధికమై దిగుబడి తగ్గిపోతున్నది. ఫలితంగా రైతులు అప్పులపాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు మల్చింగ్ పద్ధతి సాగు రైతులకు వరంగా మారింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చేలా జిల్లాలోని పలు మండలాల్లోని రైతులు మల్చింగ్ విధానంలో సాగు చేస్తున్నారు. పంటల సాగులో కలుపును ఈ పద్ధ్దతిలో పూర్తిగా నివారించవచ్చు. అలాగే మట్టి కోతకు గురి కాకుండా ఉండి నేల ఉష్ణోగ్రత నియంత్రణలోకి వస్తుంది. సాగునీరు, ఎరువుల ఖర్చు ఆదా అవుతోంది. ఫలితంగా నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మల్చింగ్ కోసం రైతులు కొంత పెట్టుబడిని పెట్టాల్సి వస్తున్నా కొంత భాగాన్ని ప్రభుత్వం రాయితీ కింద అందిస్తుంది.
50 శాతం రాయితీ
మల్చింగ్ విధానంలో పంటలు సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ మంజూరు చేస్తుంది. హెక్టారుకు సుమారు రూ.32 వేలు ఖర్చు అవుతుండగా ప్రభుత్వం 50 శాతం రాయితీ కల్పిస్తుంది. అంతే ఖర్చులో రూ.16 వేలు నగదును రాయితీ కింద మంజూరు చేస్తుంది. ముందుగా రైతు మల్చింగ్ ఏర్పాటు చేసుకుని భూమి హక్కు పట్టాతో పాటు బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు నకళ్లతో మల్చింగ్ కొనుగోలు చేసిన బిల్లును ఉద్యాన అధికారులకు సమర్పిస్తే క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి నేరుగా రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం రైతు బ్యాంక్ ఖాతాలోనే జమ చేస్తుంది.
జిల్లాలో భారీగా మల్చింగ్ సాగు..
జిల్లా వ్యాప్తంగా మల్చింగ్ విధాననంలో రైతులకు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. కూరగాయలు, పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి, జామ మొదలగు తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ, జూలూరుపాడు, సుజాతనగర్, ఇల్లెందు, టేకులపల్లి వంటి మండలాల్లో మల్చింగ్ పద్ధ్దతిలో రైతులు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. సుమారు 2,500 నుంచి 3,000 ఎకరాల్లో మల్చింగ్ పద్ధ్దతిలో రైతులు పంటలను పండిస్తున్నారు.
మల్చింగ్లో కలుపు నివారణ
మల్చింగ్ విధానంతో కలుపును పూర్తిగా నియంత్రించవచ్చు. అదేవిధంగా నీటి తడులు ఆదా చేయవచ్చు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రభుత్వం కూడా 50 శాతం రాయితీ కల్పిస్తున్నది. మల్చింగ్ సాగుతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని పంట పెట్టుబడిని తగ్గించుకోవటం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చు.- గార్లపాటి రాంబాబు, రైతు, అశ్వారావుపేట