ముగిసిన దరఖాస్తుల ప్రక్రియ
ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో ముందడుగు
పారిశ్రామికవేత్తల నుంచి 70 దరఖాస్తులు
ఖమ్మం, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఇప్పటికే రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద 157 ఎకరాల భూమిని సేకరించి రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించింది. అయితే, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు తొలుత జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు తుది గడువు విధించింది. వివిధ కారణాలతో దరఖాస్తు తేదీని జూలై12 వరకు పొడిగించగా.. గడువు ముగిసింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం మొత్తం 70 దరఖాస్తులు వచ్చాయి.
ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఖమ్మం జిల్లా పారిశ్రామికంగా ముందడుగు వేసేందుకు ఉపయోగపడనున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ను ప్రభుత్వం రఘునాథపాలెం మండలం జింకలతండా వద్ద 157 ఎకరాల భూమిని సేకరించి రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థకు అప్పగించింది. వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులు కోరింది. తొలుత జూన్ 30 వరకు దరఖాస్తుకు తుది గడువు విధించగా వివిధ కారణాలతో దరఖాస్తు చేసే తేదీని ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించారు.
దరఖాస్తుల పరిశీలన..
ఖమ్మం జిల్లాలో రైస్మిల్లులు, ఫార్ బాయిల్డ్ రైస్మిల్లులు, చిల్లీ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలకు సుమారు 70 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుదారుడు ప్రాసెసింగ్ ఫీజు రూ.5వేలు, 18శాతం జీఎస్టీని చెల్లించడంతోపాటు రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు. అయితే, పరిశ్రమ స్థాపించడానికి దరఖాస్తు చేసుకొన్న పారిశ్రామికవేత్త సమర్పించిన డీపీఆర్ ఆధారంగా అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో భూమిని కేటాయించనున్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ముగియడంతో అధికారులు దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. సాధ్యమైనంత త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులకు ఇప్పటికే సూచించింది. మొత్తం 70 దరఖాస్తుల్లో ఏ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? నిర్ణీత పరిశ్రమలకు సంబంధించి దరఖాస్తులు ఎన్ని? అన్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మరో 15 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న పారిశ్రామిక వేత్తలకు భూమి కేటాయింపునకు సంబంధించి సమాచారం అందే అవకాశం ఉంది.
కొత్త పరిశ్రమలతోపాటు..
కొత్త పరిశ్రమలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉండి ఖమ్మం ఫుడ్ప్రాసెసింగ్ జోన్కు పరిశ్రమలను తరలించేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో పలువురు దరఖాస్తు చేశారు. సాగునీటి వనరులు జిల్లాలో అభివృద్ధి చెందడం, సాగర్ జలాలు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ప్రవహించడంతో కొన్నేళ్లుగా జిల్లాలో వరి పంట విస్తారంగా పండుతోంది. ఖమ్మం జిల్లా ధాన్యాగారంగా విరాజిల్లుతున్నా.. అందుకు తగిన ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం కోసం ఇతర ప్రాంతాలకు రవాణా చేయడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. దీని దృష్ట్యా ఫార్ బాయిల్డ్, రా రైస్మిల్లుల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించడంతో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.