ప్రతి రోజూ సరఫరా చేయనున్న సారపాక ఐటీసీ
నేడు ప్రారంభించనున్న మంత్రి అజయ్కుమార్
ఖమ్మం సిటీ, మే 12: ఇక నుంచి ఖమ్మం జిల్లాకు ఆక్సీజన్ కొరత ఉండదు. సారపాకలోని ఐటీసీ నుంచి ఇక ప్రతి రోజూ 5 మెట్రిల్ టన్నుల ఆక్సీజన్ ఖమ్మం జిల్లాకు సరఫరా అవుతుంది. ఈ ట్యాంకర్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో జెండా ఊపి ప్రారంభించనున్నారు. మంత్రి అజయ్కుమార్ రవాణా శాఖ నుంచి ఐదు మెట్రిక్ టన్నుల ట్యాంకర్ను ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాకు కేటాయించారు. సారపాకలోని ఐటీసీ కూడా గురువారం నుంచి ప్రతి రోజూ ఈ ట్యాంకర్ను ఆక్సీజన్తో నింపి ఖమ్మం జిల్లా అధికారులకు అందజేస్తుంది. ఈ ఆక్సీజన్ ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఆక్సీజన్ అవసరాలను తీరుస్తుంది. ఇకనుంచి ఖమ్మం జిల్లా ఆక్సీజన్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఇందుకోసం మంత్రి అజయ్కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.