నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
ఖమ్మం, మే 11 : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన వడగళ్ల వానతో జన జీవనం ఇక్కట్లకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం వాతావరణంలో ఒక్క సారిగా సంభవించిన మార్పులతో పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో గాలి దుమారంతో వాన రావడంతో జనజీవనం స్తంభించింది. ఖమ్మం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో రైతుల ధాన్యం కల్లాల్లో ఉండడంతో వారు ఆందోళనకు గురయ్యారు. రైతులు అప్రమత్తతతో ధాన్యం తడవకుండా పట్టాలను రక్షణగా కప్పుకున్నారు. కొన్ని చోట్ల ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం నగరంలో కురిసిన భారీ వర్షంతో ఏర్పడిన విద్యుత్ అంతరాయం నగర వాసులు ఇబ్బందులుపడ్డారు. కరోనా కారణంగా ఇంటికి పరిమితమైన ప్రజలు, వ్యాపారులు సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఇబ్బందులు పడ్డారు. గాలి దుమారంతో నగరంలో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరో వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ నిర్ణయం ప్రకటించడంతో నగర వాసులు అనేక మంది సాయంత్రం వేళలో నిత్యావసర సరుకులు, ఇతర అవసరాలను తీర్చుకోవడానికి బజారుకు వెళ్లారు. ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు. పలు ఆసుపత్రుల్లో ఉన్న రోగులు అసౌకర్యానికి గురయ్యారు.