సారపాక, ఆగస్టు 3 :ఆపదలో ఉన్నామని సమాచారం తెలిస్తే చాలు ఆసుపత్రిలో ప్రత్యక్షం
రక్తం అవసరమని.. ఎవరైనా ఆపదలో ఉన్నామని తెలిస్తే చాలు.. ఏమి ఆలోచించకుండా క్షణాల్లో అక్కడుంటారాయన. రక్తం కావాలని ఎవరు ఫోన్ చేసినా, వేరొకరి ద్వారా సమాచారం అందించినా ఎక్కడున్నా ఆగమేఘాలపై అక్కడకు చేరుకుంటారు. ఎంతదూరమైనా సరే ఆపదలో ఉన్నవారి వద్దకు వెళ్లి ఆసుపత్రిలో రక్తదానం చేస్తారు. 12 ఏళ్ల కాలంలో 56 సార్లు ఆపదలో ఉన్న వారిని కాపాడి ప్రాణదాతగా నిలిచారు విజయ్కుమార్ కంచేటి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మణుగూరు క్రాస్రోడ్డు వద్ద కంచేటి వెంకటేశ్వరరావు, చంద్రకళ దంపతుల కుమారుడు విజయ్కుమార్. 32 ఏళ్ల వయస్సులో ఆయన ఆపదలో ఉన్నవారికి రక్తం అందించాలనే సంకల్పించారు. అప్పటి నుంచి ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. విజయ్ సారపాక ఐటీసీ పీఎస్పీడీలో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ‘బి’ పాజిటివ్ రక్తం అవసరం ఉన్నవారికి రక్తమిచ్చి ప్రాణదాతగా నిలుస్తున్నారు.
12 ఏళ్లలో 56 సార్లు రక్తదానం..
ఆపదలో ఉన్నవారెవరైనా సమాచారం అందిస్తే చాలు వెంటనే ఆసుపత్రికి వెళ్లి రక్తం ఇవ్వడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రధానంగా తలసేమియా బాధితులతోపాటు గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడినవారికి రక్తాన్ని దానం చేస్తారు. ఆపదలో ఉన్నవారు ఎంత దూరంలో ఉన్నా అక్కడకెళ్లి వారికి రక్తదానం చేస్తారు. 12 ఏళ్లుగా 56 సార్లు రక్తదానం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ నాలుగు సార్లు రక్తదానం చేసి బాధితులను ఆదుకున్నారు.
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
రక్తదానం.. ప్రాణదానంతో సమానం. ఆపదలో ఉన్నవారు సాయం పొందాక చూపించే ఆదరణ మరువలేనిది. ఆ ఆదరణ నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. తల్లిదండ్రులు, భార్య, స్నేహితుల సహకారం మరువలేనిది. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన రక్తనిల్వలు లేవు. జాగ్రత్తలు తీసుకుంటూ కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవాలి. రక్తదానంలో సెంచరీ సాధించాలని కోరిక ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి యువత రక్తదానం చేయాలి. రక్తం అవసరమని ఎవరు ఫోన్ చేసినా, సమాచారం అందించినా స్పందిస్తా.