ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా సంస్థలో అరుదైన పెసర విత్తనం
దక్షిణ భారతదేశంలో ఘనత సాధించిన మధిర వ్యవసాయ పరిశోధన సంస్థ
ఈ విత్తనంతో క్వింటాకు 8 క్వింటాళ్ల దిగుబడి
మధిర రూరల్, అక్టోబర్ 10 : మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల పరిశోధనలో భాగంగా మధిర ముంగ్, ఆశ 2-4 అనే రకాలను సంకరపరిచి అభివృద్ధి చేసి ఎంజీజీ-385 అనే రకం పెసర విత్తనాన్ని రూపొందించారు. ఈ పెసర విత్తనం వానకాలం, యాసంగి సహా అన్ని కాలాలకు అనుగుణంగా పంటనిస్తుంది. మధ్యస్థ పంటకాలం (70 నుంచి 76 రోజులు)లో అధిక దిగుబడి సామర్థ్యం కలిగిన విత్తనమిది. హెక్టారుకు 15 క్వింటాళ్ల నుంచి 17 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం పెసర మొక్క నిటారుగా పెరుగుతుంది. కాయ గుత్తులుగా పైభాగాన వ్యాపించి ఉండి ఒకేసారి కోతకు వస్తాయి. పెసర గింజలు మధ్యస్థ లావుగా ముదురు ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటాయి. మోవు కుళ్లు, ఆకుముడతను సమర్థవంతంగా తిప్పికొట్టగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. పళ్లాకు, ఆకుపచ్చ తెగుళ్లను, మార్క్ మచ్చల పురుగులను, బూడిద తెగులును కొంతవరకు తట్టుకోగలదు. ఈ రకంలో మాంసకృత్తులు 29 శాతం ఎక్కువగా ఉండడం ఒక విశేషం. వ్యవసాయ పరిశోధన స్థానంలో దిగుబడి పరీక్షలను 2012 నుంచి 2016 సంవత్సరం జరిపినప్పుడు ఎంజీజీ 295 విత్తనం కన్నా అధిక దిగుబడి ఇచ్చినట్లు నిరూపితమైంది.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పరిశోధనా స్థానాల్లో పరీక్షించినప్పుడు 2016-17, 2017-18ల్లో ఎంజీజీ – 385 విత్తన రకం హెక్టారుకు 16 క్వింటాళ్ల దిగుబడినిచ్చింది. ఎంజీజీ – 295 రకం హెక్టారుకు 13 క్వింటాళ్ల కన్నా 11.8 శాతం, డబ్ల్యూజీజీ-37 రకం హెక్టారుకు 14 క్వింటాళ్ల కన్నా అధిక శాతం దిగుబడి సాధించింది. అంతేకాకుండా అఖిల భారత సమన్వయ పప్పుదినుసుల సంస్థ (ముల్లర్స్) దక్షిణ భారతదేశంలోని 9 రాష్ర్టాల్లో నిర్వహించిన దిగుబడి పరీక్షల్లో 2016-17, 2018-19ల్లో ప్రామీణ రకాలు కో-6 (21 శాతం), పూస-9072 (20 శాతం), టీఎఆర్ఎన్-1 (17శాతం), వీబీఎన్జీజీ.-2 (9 శాతం) కన్నా అధిక దిగుబడి సాధించింది. 2019 నుంచి 2021 వరకు వానకాలం, యాసంగి కాలాల్లో రైతు క్షేత్రాల్లో జరిపిన సిరిసంచుల ప్రదర్శనలో ప్రామాణికం ఎంజీజీ-295 కన్నా 11 శాతం అధిక దిగుబడిని ఇవ్వడం గమనార్హం.
ఈ లక్షణాల కారణంగా ఈ పెసర రకాన్ని మధిర పెసర-1గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో రైతుల కోసం ఈ రకపు విత్తనాన్ని విడుదల చేశామని, అన్ని కాలాలకూ అనువైనదని, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుందని, రైతులు ఈ పెసర రకాన్ని సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ మధిర వ్యవసాయ పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్తలు కాసాని రుక్మిణి, అజ్మీరా శ్రీనివాసరావు, సుల్తాని శ్రీనివాసరావు, వీ.శ్రీధర్, కే.నాగస్వాతి, జీ.వేణుగోపాల్ తెలిపారు.
అధిక దిగుబడినిస్తుంది..
మధిర వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఎంజీజీ-385 పెసర విత్తనం తెలంగాణ రైతుల కోసం విడుదల చేయడం ఆనందాన్ని కలిగించింది. ఈ రకం విత్తనం ఒక ఎకరాకు 7 నుంచి 9 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం విత్తనాలను రైతులు సాగు చేయడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. మూడు కాలాలకు అనుగుణంగా ఈ విత్తనం తయారు చేశాం. కావాల్సిన రైతులు వ్యవసాయ పరిశోధన స్థానంలో సంప్రదించి విత్తనాలు పొందగలరు.
-కాసాని రుక్మిణి, సీనియర్ శాస్త్రవేత్త
అన్ని తెగుళ్లనూ తట్టుకోగలదు..
ఎంజీజీ-385 రకపు పెసర విత్తనం పల్లాకు, ఆకుపచ్చ తెగుళ్లను, మచ్చల పురుగులను తట్టుకోగలదు. దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ర్టాల్లో జరిపిన పరిశోధనల్లో ఈ రకం విత్తనం అధిక దిగుబడి ఇస్తున్నట్లుగా పరీక్షల్లో తేలింది. ఈ విత్తనం మధిర వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల కావడం ఎంతో సంతృప్తి నిచ్చింది. రైతులు ఈ పెసర రకపు విత్తనాలను సాగు చేసి అధిక దిగుబడి సాధించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
-సుల్తాని శ్రీనివాసరావు, సీనియర్ శాస్త్రవేత్త