ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు రెండు బస్సుల కేటాయింపు
నగరంలో బస్సును ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం/ రఘునాథపాలెం, జూన్ 10: ప్రజలకు కొవిడ్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు మొబైల్ ఐసీయూ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కొవిడ్ బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పటిష్ట చర్యలతోపాటు వీరాస్మార్ట్ హెల్త్కేర్ సహకారంతో ఇటీవల హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ మొబైల్ మెడికల్ యూనిట్ బస్సులను అన్ని జిల్లాలకు కేటాయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు వచ్చిన మొబైల్ ఐసీయూ బస్సును రోటరీనగర్లో కలెక్టర్ కర్ణన్తో కలిసి మంత్రి అజయ్ గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రెండు మొబైల్ మెడికల్ యూనిట్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చి బాధ్యులు, వైద్య సేవలను అందిస్తున్న వీరా హెల్త్కేర్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బస్సులో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను మంత్రి పరిశీలించారు. తొలి విడతగా రాష్ట్రంలో 30 ఐసీయూ మెడికల్ యూనిట్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు లార్డ్స్ చర్చి ప్రతినిధులు అబ్రహాం, రమేశ్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ బస్సులో వైద్యసేవలతోపాటు ల్యాబ్, డాక్టర్, నర్సింగ్ స్టాఫ్, ఆక్సిజన్తో కూడిన పది బెడ్లు ఏసీ సౌకర్యంతో అందుబాటులో ఉంటాయని వివరించారు. మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, పాస్టర్ సత్యపాల్ సందీప్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, చిరుమామిళ్ల లక్ష్మి, షేక్ జాన్బీ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక టీకా కేంద్రాలు
కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కనీస సదుపాయాలు సమకూర్చాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని శాంతినగర్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ల వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి మంత్రి గురువారం సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సూపర్ స్ప్రెడర్లందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద నీడ, తాగునీటి సౌకర్యం, కూర్చునే సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ అనంతరం తప్పనిసరిగా 30 నిమిషాలు అబ్జర్వేషన్లో ఉంచాలని, అందుకోసం ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూం, అబ్జర్వేషన్ రూం తప్పనిసరిగా ఉంచాలని మంత్రి సూచించారు. వ్యాక్సిన్ కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని డీఎంహెచ్వోను ఆదేశించారు. కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ అనురాగ్ జయంతి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, కార్పొరేటర్లు కే.మురళి, మక్బుల్ పాల్గొన్నారు.