సబ్బండ వర్గాలకు అండగా తెలంగాణ సర్కార్
ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలతో లబ్ధి
కర్షకుల కోసం రైతుబంధు, రైతుబీమా..
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,దివ్యాంగులకు ఆసరా పింఛన్లు
కులవృత్తుల ప్రోత్సాహానికి రాయితీలు
ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి కానుక
ఖమ్మం/కొత్తగూడెం, అక్టోబర్ 9: ‘తెలంగాణ వస్తే ఏమోస్తది. కొత్త రాష్ట్రం ఏర్పడితే విద్యుత్ సమస్యలు తలెత్తుతాయి. రాష్ట్రం అంధకారం అవుతుంది. ఈ ప్రాంత ప్రజలకు పరిపాలించుకోవడం రాదు. పంటలు ఎండిపోతాయి.’ ఇవీ 2014కు ముందు వలస పాలకులు ఏడుపులు.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్బండ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఏదోఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల నాయకులు సర్కార్పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా అసత్య ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అన్న ప్రశ్నకు బదులుగా పథకాలు లబ్ధిపొందిన వారి కేస్ స్టడీలతో ప్రత్యేక కథనం.
ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలతో భరోసా కల్పిస్తున్నారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకూ అనేక పథకాలు అమలు చేస్తూ ప్రతి ఇంటికీ పెద్దదిక్కయ్యారు. దళితోద్ధరణ కోసం ‘దళిత బంధు’తో ఎస్సీ కుటుంబాలకు ఇంటికి రూ.10 లక్షలు అందించి వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఏడేండ్ల పాలనలో ఊరూరా సంక్షేమం.. ఇంటింటా సౌభాగ్యం వెల్లివిరుస్తున్నది.
ఆడబిడ్డలకు కానుక ‘కల్యాణలక్ష్మి’
సత్తుపల్లి, అక్టోబరు 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నది. ఆడబిడ్డల పెండ్లిళ్లకు
మేనమామగా సీఎం కేసీఆర్ నగదు అందజేస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
ఏటా వేలాది మంది కల్యాణలక్ష్మి చెక్కులు అందుకుంటున్నారు. వారిలో ఇద్దరు కుమార్తెల పెండ్లిళ్లు చేసి రెండు చెక్కులు అందుకున్న ఓ తల్లి మనోగతం ఇదీ..!
గురుకులాల బలోపేతం.. విద్యార్థులకు వరం
సత్తుపల్లి, అక్టోబర్ 9: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులను
విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు గురుకులాలు, మైనార్టీ పాఠశాలలను బలోపేతం చేశారు. వాటిలో విద్యార్థులకు సకల వసతులు కల్పిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల కంటే మిన్నగా అక్కడ నాణ్యమైన విద్య అందుతుందంటే అతిశయోక్తి కాదు. విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే చాలు వేలాది మంది గురుకులాల్లో ప్రవేశానికి పరీక్షలు రాస్తున్నారు. గురుకుల విద్యార్థులు విద్యతోమ పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణిస్తున్నారు.
సీఎం కేసీఆరే ఆదుకున్నారు..
మేం సత్తుపల్లి పట్టణంలోని రాజీవ్నగర్లో నివసిస్తున్నాం. మా కుటుంబం దశాబ్దాల కిందటే పంజాబ్ నుంచి వలస వచ్చింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు అనిత, కవిత. భర్త విజయసింగ్ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా మేం అనాథలుగా మిగిలాం. కమ్మరి పనిచేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచా. పిల్లలు పెళ్లీడుకు రాగానే ఎలా పెళ్లి చేయాలని మదనపడ్డా. నాకు ఎలాంటి ఆధారం లేదు. ఇద్దరు కుమార్తెలకు అప్పు చేసి పెండ్లి చేశా. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నా. ఎమ్మెల్యే వెంకటవీరయ్య స్వయంగా మా ఇంటికి వచ్చి చెక్కుతో పాటు చీరె సారె అందించారు. రూ.2 లక్షల డబ్బు వచ్చింది. తిరిగి అప్పులు తీర్చాను. గౌరవంగా పిల్లల పెండ్లి చేసినా అనే సంతృప్తి కలిగింది. సీఎం కేసీఆరే ఆదుకున్నారని అనుకున్నా. భర్త చనిపోవడంతో నాకు పింఛను రూ.2,016 వస్తున్నది. ఎవరి మీద ఆధార పడకుండా పింఛనుతో పాటు నేను పని చేసుకున్న డబ్బులతో జీవిస్తున్నా.
కొలువు.. జీవితంలో వెలుగు
తెలంగాణలో విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకూడదనే సంకల్పంతో 2015లో సీఎం కేసీఆర్ మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులో నిర్మాణానికి 1080 మెగావాట్ల ఉత్పత్తి బీటీపీఎస్ (భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అధికారులు ప్లాంటు నిర్మాణానికి సుమారు 1,100 ఎకరాల భూమిని సేకరించారు. నిర్వాసితుల్లో కొందరు పరిహారం అందుకున్నప్పటికీ మరికొందరు మాత్రం తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. వారి డిమాండ్లను విన్న ప్రభుత్వం తొలి దశలో 307 మందికి ఉద్యోగాలిస్తూ ఇటీవల నియామక పత్రాలు ఇచ్చింది. కొందరిని హైదరాబాద్, కొత్తగూడెంలోని కేటీపీఎస్లో సర్దుబాటు చేసింది. రెండో దఫాలో మరో 25 మందిని పాల్వంచ, ఇతర ఏరియాల్లో సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నది.
సర్కార్కు రుణపడి ఉంటాం..
మేం రోడ్డు పక్కన కమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తాం. నాలుగేళ్ల క్రితం సొంత గూడు లేక ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో ఉండేవాళ్లం. కొన్నిసార్లు అద్దె కట్టడం కూడా గగనమయ్యేది. ఇంటి యాజమానులు ఇల్లు ఖాళీ చేయాలని బెదరింపులకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. కడు పేదరికంలో ఉన్న మా కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించింది. సీఎం కేసీఆర్కు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
విద్యకు ప్రాధాన్యత..
2021 విద్యా సంవత్సరానికి 10,900 మంది విద్యార్థులకు రూ.2.24 కోట్ల పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లు అందాయి. రూ.9.31 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అందింది. ట్రైకార్ పథకం కింద లబ్ధిదారులకు 451 యూనిట్లకు రూ.376.38 లక్షల రాయితీ అందింది. 12,586 మంది బీసీ విద్యార్థులకు రూ.12.50 కోట్ల ఉపకార వేతనాలు అందాయి. 3,446 మంది లబ్ధిదారులకు 100శాతం రాయితీపై రూ.1,223 కోట్లు అందాయి. జిల్లా వ్యాప్తంగా 751 చెరువులకు ప్రభుత్వం ఈ సంవత్సరం 3,08 37 950 కోట్ల చేప పిల్లలను వందశాతం రాయితీపై అందజేసింది. దీంతో ఖమ్మం జిల్లావ్యాప్తంగా 183 మత్స్య సహకార పారిశ్రామిక సంఘాల పరిధిలో 14 వేల మందికి లబ్ధి చేకూరినట్లయింది. వలలు, తెప్పలు, వాహనాల రాయితీ కోసం ప్రభుత్వం నుంచి రూ.38 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ప్రభుత్వ గణంకాల ప్రకారం చేపల ఉత్పత్తిలో జిల్లా 3వ స్థానంలో ఉండడం విశేషం. నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకున్న ఎస్సీ కుటుంబాలకు బిల్లులో ప్రభుత్వం పూర్తి రాయితీ ఇస్తున్న సంగతి విదితమే. పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.81.68 లక్షలను విద్యుత్శాఖకు చెల్లించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..
భద్రాద్రి జిల్లాలో ఇప్పటివరకు రైతుబీమా ద్వారా 1,605 మందికి రూ.5 లక్షల చొప్పున రూ.80.2 కోట్ల పరిహారం అందింది. గడిచిన నాలుగేళ్లలో 1,34,430 మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ.1,234 కోట్లు చెల్లింపులు జరిగాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఇప్పటివరకు 20,956 మందికి చెక్కులు అందాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు అయిన 33,130 మంది కేసీఆర్ కిట్లు తీసుకున్నారు. మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం 691 చెరువులకు రూ.1.22 కోట్ల ఖర్చుతో 1.78 కోట్ల చేప పిల్లలను పూర్తి రాయితీతో విడుదల చేసింది. మూడేళ్లకు 3.63 కోట్లు ఖర్చు చేసింది. జిల్లావ్యాప్తంగా 7,422 మంది గొల్ల కురుమలకు ప్రభుత్వం రూ.76 కోట్లతో గొర్రెల యూనిట్లు పంపిణీ చేసింది. ట్రైకార్ ద్వారా గిరిజన ప్రాంతంలో నిరుద్యోగులు 4,365 మందికి రూ.3,534 కోట్ల రుణాలు అందించింది. గిరి వికాసం ద్వారా 468 మంది రైతులకు రూ.76.75 కోట్లతో బోర్లను సమకూర్చింది. ఆసరా పింఛన్లు జిల్లావ్యాప్తంగా నెలకు 1,00,611 మందికి రూ.21.54 కోట్లు విడుదలవుతున్నాయి.
కరంట్ బిల్లు బాధ లేదు..
భద్రాద్రి జిల్లాలో సుమారు 1,500 సెలూన్ షాపులు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో షాపు ఆకర్షణీయంగా ఉంటేనే యువత సెలూనుకు వస్తారు. యువతను ఆకర్షించేందుకు సెలూన్ యజమానులంతా స్తోమతకు తగినట్లుగా దుకాణాల్లో లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కారణంగా నెలనెలా కరెంట్ బిల్లు అధికంగా వచ్చేది. సీఎం కేసీఆర్ గతేడాది సెలూన్ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని ప్రకటించి నాయీబ్రాహ్మణులకు మేలు చేశారు. విద్యుత్ బిల్లుల బాధ లేకపోవడంతో సెలూన్ నిర్వహణ సాఫీగా సాగుతున్నది. నెలకు సుమారు రూ.2 వేల కరెంటు బిల్లు ఆదా అవుతుంది.