వాటిల్లో పుష్కలంగా పీచు పదార్థాలు
‘దీర్ఘ’ వ్యాధుల నివారణ దివ్యౌషధాలు
కరోనా నియంత్రణకు కీలక ‘ధాన్యాలు’
ఆరోగ్య రక్షణ కోసం పెరిగిన వినియోగం
కొత్తగూడెం టౌన్, అక్టోబర్ 9 : కరోనా కారణంగా ప్రస్తుతం జనంలో ఆరోగ్య స్పృహ అమాంతం పెరిగింది. ఏనాడో మర్చిపోయిన చిరుధాన్యాలను, అదీ సేంద్రియ పద్ధతుల్లో పండించిన దినుసులను ప్రధాన ఆహారంగా కోరుకుంటున్నారు. అరవై డబ్భు ఏళ్లు వెనక్కి వెళ్తే.. పల్లెల్లో ఎక్కువమంది తినే ఆహారం జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, సామలు, ఒడలు లేదా ఊదలు, ఒరిగెలు వంటి చిరుధాన్యాలే. కానీ 1960లో మొదలైన హరిత విప్లవం కారణంగా వాటిస్థానంలో గోధుమ, వరి పెరిగాయి. వాటితోపాటే మధుమేహం, ఊబకాయం, హృద్రోగం, క్యాన్సర్ వంటివి ఒంట్లోకి చేరాయి. ఇంకా లెక్కలోకి రాని రోగాలెన్నో. ఈ నేపథ్యంలో జనాల్లోనూ ఆరోగ్య అవగాహన పెరిగింది. సుమారు దశాబ్దం నుంచి అక్కడక్కడా చిరుజల్లులా మొదలైన చిరుధాన్యాల పంటా, వంటా.. ఈ ఏడాది పతాకస్థాయికి చేరుకున్నాయి. నీటివసతి లేకున్నా, ఎండలు మండుతున్నా, సారవంతమైన నేలకాకున్నా చిరుధాన్యాలు బాగా పండుతాయి. ఎరువులు, పురుగుమందుల అవసరమే లేదు. వీటిని సేంద్రియ పద్ధతుల్లోనే పండిస్తారు.
దీర్ఘకాలిక వ్యాధులకు విరుగుడులా..
వరి, గోధుమల్లో పీచు పదార్థం (ఫైబర్) తక్కువైపోయింది. ఎరువులు, పురుగుమందులు లేని అన్నమే కరువైంది. దీంతో వ్యాధులు సంక్రమిస్తున్నాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. వీటిని నివారించుకోవాలంటే చిరుధాన్యాలను తినాలని శాస్త్రవేత్తలు, ప్రకృతి వైద్యులు సూచిస్తున్నారు.
కొర్ర బియ్యం
దీనిలో సమతుల్య ఆహారం ఉంటుంది. ఎనిమిది శాతం ఫైబర్తోపాటు 12 శాతం ప్రోటీన్ ఉంది. ఇది గర్భిణులకు సరైన ఆహారం. పిల్లల్లో జ్వరం, మూర్చ లక్షణాలను పోగొట్టే గుణం కలిగి ఉంటుంది. నరాల సంబంధమైన బలహీనతలకు సరైన ఆహారం కొర్రబియ్యమే.
అరికెలు బియ్యం
రక్తశుద్ధికి, ఎముకల మధ్య మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, ఆస్తమా, మూత్రపిండాల వ్యాధులు, ప్రొస్సెడ్, బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్, గొంతు, కాలేయపు క్యాన్సర్లను తగ్గించుకోవడానికి అరికెలు బియ్యం ఎంతో మేలు చేస్తాయి.
సామ బియ్యం
ఆడ, మగవారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులను బాగు చేస్తాయి. మహిళల్లో పీసీవోడీ తగ్గించుకోవచ్చు. లింపు మండలపు శుద్ధికి మేలు చేస్తాయి.
ఊద బియ్యం
థైరాయిడ్, క్లోమ గ్రంథులకు ఇవి ఎంతో మంచివి. చక్కెర వ్యాధిని పారదోలుతాయి. కాలేయం, మూత్రాశయం, గాల్బ్లాడర్ శుద్ధికి కూడా ఇవి పనిచేస్తాయి.
చిరుధాన్యాలు ఎందుకు తినాలంటే..
ప్రస్తుతం మనుషులు మూడుపూటలా సన్నబియ్యం ఆహారం తింటున్నందున ఫైబర్ పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో జీర్ణవ్యవస్థ శుభ్రపడక అనేక సమస్యల పాలవుతున్నారు. మనిషికి అవసరమైన 25 నుంచి 30 గ్రాముల ఫైబర్ (ప్రతి మానవుడికి 38 గ్రాముల ఫైబర్ కావాలి) ఈ ధాన్యాల నుంచే లభిస్తుంది. మిగతా 10 గ్రాములు కూరగాయలు, ఆకుకూరల నుంచి పొందవచ్చు.
నాలుగేళ్లుగా చిరుధాన్యాలే..
నా వయస్సు 65 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం చిరుధాన్యాల ఆవశ్యకత తెలిసింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులందరం రోజూ ఒక పూట చిరుధాన్యాన్ని తీసుకుంటున్నాం. ఇప్పటివరకు నాకు షుగర్, బీపీతోపాటు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవు. చిరుధాన్యం అద్భుతమైన ఆహారం.
-వరప్రసాద్, కొత్తగూడెం
బరువు తగ్గాను..
నేను అనారోగ్య సమస్యలతో బాధపడేవాడిని. బరువు తగ్గడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశాను. ఆశించిన ప్రయోజనం కనిపించలేదు. రెండు నెలలుగా చిరుధాన్యాలు వాడడం మొదలుపెట్టాను. షుగర్ నియంత్రణలోకి వచ్చాయి. నిద్ర సక్రమంగా పడుతున్నది. బరువు కూడా తగ్గాను.
-తోట రాజు, కొత్తగూడెం