మానవ హక్కులను హరిస్తే చర్యలు
ఆదివాసీలను హింసించొద్దు
భద్రాద్రి ఎస్పీ సునీల్దత్
52 మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల లొంగుబాటు
కొత్తగూడెం క్రైం/చర్ల, సెప్టెంబర్ 9: మావోయిస్టులు వనంలో నుంచి జనంలోకి రావాలని ఎస్పీ సునీల్దత్ కోరారు. మానవ హక్కులను హరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులోని చర్ల మండలంలో గురువారం ఎస్పీ సునీల్ దత్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అధికారుల ఎదుట 52 మంది మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు లొంగిపోయారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. అమాయక గిరిజనులను మావోయిస్టులు బలవంతంగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారని, అంగీకరించని వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెప్పారు. వారి విధానంతో ఏజెన్సీ ప్రజలు విసుగెత్తారని అన్నారు. మావోయిస్టు పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో నాయకులు, కిందిస్థాయి దళ సభ్యులు, సానుభూతిపరులు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ చర్ల ఏరియా కార్యదర్శి అరుణకు సహకరిస్తున్న ఐదుగురు మహిళా మిలీషియా సభ్యులు సహా 52 మంది పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వీరంతా ఏడాది కాలంగా పెసర్లపాడు, పుట్టపాడు, చందా ఏరియాల్లో బలవంతంగా శిక్షణ పొందారని చెప్పారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని జనజీవన స్రవంతిలో కలిసేందుకు వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అన్ని ప్రయెజనాలు అందిస్తామని, భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. లొంగిపోవాలనుకునే వారు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల ద్వారాగానీ, నేరుగా పోలీసుల ముందుగానీ లొంగిపోవచ్చని వివరించారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వుప్పు తిరుపతి, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ హరిఓం ఖారే, సెకండ్ ఇన్ కమాండెంట్ ప్రమోద్ పవార్, భద్రాచలం ఏఎస్పీ వినీత్, చర్ల సీఐ బొడ్డు అశోక్ కుమార్, ఎస్సైలు వెంకటప్పయ్య, రాజు వర్మ పాల్గొన్నారు.