రూ.16 లక్షల విలువైన విత్తనాలు పట్టివేత
ఎనిమిది మంది అరెస్టు.. కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం
బిల్లులు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దు..
సీపీ విష్ణు ఎస్ వారియర్
ఖమ్మం, జూన్ 07 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా రైతులకు మిరప విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సుమారు రూ.16 లక్షల విత్తనాలను స్వాధీనం చేసుకుని, 8 మందిని అరెస్టు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లైసెన్స్, ప్రభుత్వ గుర్తింపు లేకుండా రైతులకు విత్తనాలు అంటగడితే చూస్తూ ఊరుకోమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై గట్టి నిఘా ఉంచినట్లు తెలిపారు. ఏన్కూరుకు చెందిన కుచిన్ని రోశయ్య ఈ నెల 1వ తేదీన మండల పరిధిలోని బీఎన్ తండాలో ప్రభుత్వ అనుమతులు లేని మిర్చి విత్తనాలు రైతులకు విక్రయిస్తుండగా.. ఏన్కూరు పోలీసులు దాడి చేశారు. ఆయన నుంచి రూ.32 వేలు విలువ చేసే మిరప ప్యాకెట్లను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. రోశయ్యకు మిర్చి విత్తనాలు ఎవరూ సరఫరా చేశారు అనే అంశంపై లోతుగా విచారణ చేశామన్నారు. ఏన్కూరులో పార్మ్సన్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ పల్లపోటుల రవికుమార్ నుంచి 120 ప్యాకెట్లు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని సీపీ వివరించారు.
ఈ నెల 5వ తేదీన పల్లపోటుల రవికూమార్ను ఖమ్మం నుంచి జూలూరుపాడు కారులో వెళ్తుండగా ఏన్కూరులో ఆయనను అరెస్టు చేసినట్లు చెప్పారు. లైసెన్స్ లేని డీఎస్ 556 విత్తనాల 160 ప్యాకెట్లను, డీఎస్ కదంబా 160 ప్యాకెట్లను, డెక్కన్ హార్ట్ 500 ప్యాకెట్లను, డీఎస్ రెడ్ స్టార్ 400 ప్యాకెట్లను, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పల్లపోటుల రవికుమార్ ఇచ్చిన సమాచారం మేరకు లైసెన్స్ లేని విత్తనాలను రైతులకు అంట్టగట్టే దందాలో కీలకమైన వ్యక్తిగా కంపెనీ ఎండీ చంద్రశేఖర్ గుర్తించామని ఆయన కర్ణాటక రాష్ట్రంలో దావణిగిరిలో ఉంటూ దందాను నడిపిస్తున్నారని అతనితోపాటు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో కొందరూ డీలర్లు ఉన్నారని సీపీ వివరించారు. ఖమ్మం జిల్లాలోని వివిధ విత్తనాల దుకాణాలపై దాడులు చేసి లైసెన్స్ లేని మిర్చి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వీటి మొత్తం విలువ రూ.16,46,250 ఉంటుందన్నారు. మరో ఆరుగురు విత్తనాల డీలర్లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. ఈ దందాకు సూత్రదారి అయిన కంపెనీ ఎండీ చంద్రశేఖర్ పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలిస్తున్నట్లు సీపీ వివరించారు.
రైతులు మోసపోవద్దు..
రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోసపోవద్దని బిల్లు లేకుండా విత్తనాలు కొనుగోలు చేయవద్దని సీపీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. విత్తనాలను ప్రభుత్వ గుర్తింపు ఉన్న అధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని, అనుమతి, లైసెన్స్ లేని విత్తనాలను రైతులు అంటగట్టడానికి ప్రయత్నిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. నకిలీల గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అసిస్టెంట్ ఎస్పీ స్నేహా మెహ్రా, అడిషనల్ డీసీపీ సుభాష్చంద్రబోస్, కల్లూరు ఏసీపీ వెంకటేష్, టాస్క్ఫోర్స్ ఏసీపీ రామానుజం, సీఐ వేణుమాధవ్, సత్తుపల్లి రూరల్ సీఐ కరుణాకర్, ఏన్కూరు ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు దాస్, ప్రసాద్, భాస్కర్, రాజా, రమేశ్, రామకృష్ణ, నాగరాజులను సీపీ అభినందించారు.