వానకాలంలో రైతుల కోసం మండలాల్లో సిద్ధంగా స్టాక్
ఉమ్మడి జిల్లాలో 873 షాపుల్లో ‘ఈ పాస్’ ద్వారా విక్రయాలు
కొత్తగూడెం/ ఖమ్మం వ్యవసాయం, జూన్ 7: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నదాతల కోసం ఎరువులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ నెలకు సంబంధించిన నిల్వలు అందుబాటులోకి వచ్చాయి. ఏ గోదాము చూసినా ఎరువులతో నిండిపోయి కన్పిస్తున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 873 షాపుల్లో ఎరువుల అమ్మకాలకు వ్యాపారులు సిద్ధమయ్యారు. వానకాలం సీజన్ రాకముందే ఈ ఏడాది మే నెల నుంచే అధికారులు ఎరువుల స్టాక్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ పాస్ విధానంలో ఆధార్ కార్డు ద్వారా రైతులకు విక్రయించనున్నారు.
సీజన్ ప్రారంభంలోనే..
సీజన్ ప్రారంభంలోనే రైతన్నలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎరువులను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్, ఎస్ఎస్పీ ఎరువులను అధికారులు సిద్ధంగా ఉంచారు. మే నెల నుంచి విక్రయాలు జరుపుతుండగా భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే 20,373 మెట్రిక్ టన్నులు ఎరువులు అదనంగా ఉన్నాయి. వానకాలం సీజన్కు గాను 1,55,501 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేశారు.
ఉమ్మడి జిల్లాలో 873 షాపుల ద్వారా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 873 షాపుల ద్వారా ఎరువులను విక్రయించనున్నారు. కొత్తగూడెం జిల్లాలో 337 ఎరువుల షాపులు, 11 రైతు సేవా కేంద్రాలు, 23 ప్రాథమిక సహకార సంఘాల్లో రైతులు కొనుగోలు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో 376 షాపులు, 76 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 50 రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించనున్నారు. ప్రతి షాపు దగ్గరా ఈ-పాస్ యంత్రాన్ని అందుబాటులో ఉంచారు. అందులో రైతు ఆధార్ నెంబరు నమోదు చేయడం ద్వారా విక్రయాలు జరుపుతున్నారు. దీని వల్ల ఎరువుల నిల్వలపై వ్యవసాయ శాఖకు పక్కా సమాచారం తెలియనుంది.