సీఎం కేసీఆర్ ఫెక్సీలకు పూలు, పాల అభిషేకాలు
సత్తుపల్లి/ కల్లూరు/ రఘునాథపాలెం/ మధిర రూరల్, ఆగస్టు 5: సమాజంలో వెనుకబడి, వివక్షకు గురైన తమ అభ్యున్నతి కోసం ‘దళిత బంధు’ పథకాన్ని తెచ్చిన సీఎం కేసీఆర్ను దళిత నేతలు కొనియాడారు. దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడంతోపాటు గురువారం జీవోను జారీ చేయడం పట్ల ఖమ్మం జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. దళిత బాంధవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఆయన ఫ్లెక్సీలకు నేతలు, దళితులు క్షీరాభిషేకాలు చేశారు. కల్లూరు మండల కేంద్రంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అలాగే రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామ ఎస్సీ వాడ దళితులు కూడా సంబురాలు జరుపుకున్నారు. అంబేద్కర్ సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 57 ఏళ్లకే ఆసరా పింఛన్ అందించనుండడాన్ని, రూ.50 వేల లోపు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేయడాన్ని హర్షిస్తూ మధిరలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీపీ ఎంపీపీ మెండెం లలిత, మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
సత్తుపల్లిలో పుష్పాభిషేకం
అన్నదాతల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడుతున్న సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతాయరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతగా సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, తాటికొండ రాజయ్యలతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పుష్పాభిషేకం చేశారు.