హరిత నిధికి రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం విరాళం
రామయ్య రెక్కలకష్టంతో ఊరూరా పెరుగుతున్న మొక్కలు
ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం
జిల్లాలో పలుచోట్ల ఎర్రచందనం, శ్రీగంధం మొక్కల పెంపకం
ఆయన కృషితో 50 ఎకరాల్లో రెండు లక్షల ఎర్రచందనం చెట్లు
బడ్జెట్ వనంగా ముత్తగూడెం వనం
ఖమ్మం, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);ఆయన ప్రకృతి ప్రేమికుడు.. పర్యావరణ పరిరక్షకుడు.. నిస్వార్థ జీవి.. ఆరు పదుల వయస్సులోనూ ఖాళీ జాగా కనిపిస్తే చాలు విత్తనాలు చల్లుతారు. ఆయన రెక్కల కష్టంతో ఊరూరా మొక్కలు పెరుగుతున్నాయి. ఏ విత్తనం చల్లాలి., ఏ మొక్క పెంచాలన్నదే ఆయన ధ్యాస.. శ్వాస.. ఎవరేమన్నా.. ప్రభుత్వానికి ఆదాయనిచ్చే మొక్కలను పెంచడమే తన లక్ష్యమంటారు వనజీవి రామయ్య. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరిత నిధి కోసం తన పెరటిలో 40 ఏండ్లుగా పెంచుకున్న విలువైన ఎర్రచందనం దుంగలను ప్రభుత్వానికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అంతేకాదు, ముత్తగూడెంలోని పాండవుల గుట్ట వద్ద సుమారు 2లక్షల ఎర్ర చందనం మొక్కలను పెంచి.. దానికి బడ్జెట్ వనంగా నామకరణం చేశారు. 2017లో పద్మశ్రీ అవార్డు అందుకున్న వనజీవి రామయ్య.. ఇప్పటికీ మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు పచ్చదనం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై ‘నమస్తే తెలంగాణ’ స్ఫూర్తిదాయక కథనం.
వనజీవి రామయ్యగా అందరికీ సుపరిచితుడైన రామయ్యకు మొక్కలంటే ప్రాణం. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఆయన ఆరుపదుల వయస్సు దాటినా ఇప్పటికీ మొక్కలు నాటుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పెన్షన్గా ఇస్తున్న రూ. 40 వేలతో సైతం వివిధ రకాల విత్తనాలు, మొక్కలు కొనుగోలు చేసి రహదారుల వెంట నాటుతున్నారు. స్వయంగా విత్తనాలు కొని ప్రభుత్వ స్థలాల్లో చల్లుతున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా ‘బడ్జెట్ వనం
రూరల్ మండలంలోని ముత్తగూడెం పాండవుల గుట్ట వద్ద సుమారు 2 లక్షల ఎర్రచందనం మొక్కలు పెంచుతూ వనానికి ‘బడ్జెట్ వనం’గా నామకరణం చేశారు. అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్లి చూడడం ఆయనకెంతో ఇష్టం. వనంలోని మొక్కలతో ఎర్ర చందనం మొక్కల ద్వారా ప్రభుత్వానికి రాబడి తీసుకురావడమే తన లక్ష్యమని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ప్రొత్సహిస్తే రకరకాల విత్తనాలు, గింజలు తానే స్యయంగా ఇస్తానంటున్నారు. ఇందుకు నెలకు రూ.1.70 లక్షలు అవసరమవుతాయని చెప్తున్నారు.
మొక్కలంటే ప్రాణం..
రామయ్యకు మొక్కలతో విడదీయలేని అనుబంధం ఉన్నది. తన ఇంటికి ఎవరు వచ్చినా పండ్ల మొక్కలు ఇవ్వడాన్ని అలవాటుగా పెట్టుకున్నారు. సతీమణి జానమ్మతో కలిసి ఇప్పటికీ లక్షలాది మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. దశాబ్దం క్రితమే కోటి మొక్కలను నాటి రికార్డును సృష్టించారు. తన మనుమరాళ్లందరికీ వనశ్రీ, హరిత లావణ్య, కదంబ పుష్ప అని పేర్లు. మొక్కలంటే ఆయనకెంత ఇష్టమో తెలుసుకోవచ్చు. తాను నాటే మొక్కలకు రక్షణ గోరింటాకు మొక్క, వాయిలాకు మొక్కను రక్షణగా ఉంచడం ఈయన ప్రత్యేకత. ఈయన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామానికి ఒక ట్రాక్టర్, ట్యాంకర్ కేటాయించి మొక్కల పెంపకంపై దృష్టి సారిస్తున్నదని రామయ్య కితాబునిచ్చారు. రఘునాథపాలెం మండలంలోని గణేశ్వరం వద్ద సుమారు క్వింటా ఎర్ర చందన గింజలను ఆరు కిలో మీటర్ల పరిధిలో రోడ్డు వెంట నాటానన్నారు. భవిష్యత్తులో ఇది ప్రభుత్వానికి పెద్ద ఆస్తిగా మారనుందన్నారు.
హరితనిధికి విరాళం
ప్రభుత్వం హరితహారం కోసం ఏర్పాటు చేసిన హరితనిధిలో భాగస్వామి కావాలని తలచారు. అనుకున్నది తడువుగా హరితనిధి కోసం తన పెరటిలో 40 ఏండ్లుగా పెంచుకున్న విలువైన ఎర్రచందనం దుంగలను ప్రభుత్వ హరితనిధికి ఇవ్వాలని నిర్ణయించారు. సుమారు 20 టన్నులను ఈ నిధికి ఇవ్వాలనుకున్న రామయ్య ఒక టన్నుకు రూ. 10 లక్షలు విలువ చేసే సుమారు రూ. 2 కోట్ల విలువైన సంపదను హరిత నిధికి విరాళంగా ఇచ్చారు. కరెన్సీ నోట్లపై పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం ఉండాలనేది ఆయన ఆకాంక్ష.