ఆయిల్పాం సాగులో ఆదర్శం అశ్వారావుపేట’
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
చండ్రుగొండ, అన్నపురెడ్డి పల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
చండ్రుగొండ, ఆగస్టు 4: రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా పరిఢవిల్లుతున్నాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతే రాజు అని అన్నారు. రైతుబీమా ద్వారా రైతు కుటంబాలకు భరోసా ఇస్తున్నట్లు చెప్పారు.
రైతువేదికలు రైతులకు దేవాలయాలుగా మారాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం చుండ్రుగొండ మండలంలో శాసనసభ్యుడు మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి పోకలగూడెం, బాలియతండా, గానుగపాడు, రావికంపాడు, తిప్పనపల్లిలో పర్యటించి పల్లె ప్రకృతి వనాలు, రైతువేదికలు, వైకుంఠధామాలను ప్రారంభించారు. అనంతరం చండ్రుగొండ రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రైతువేదికలు నిర్మిస్తున్నదన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ షెడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రైతుబీమా ద్వారా రైతు కుటంబాలకు భరోసా ఇస్తున్నదన్నారు. తాజాగా రూ.50 వేల వరకు రుణం తీసుకున్న వారికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిందన్నారు. ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో మిషన్భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నదన్నారు. రైతుబంధు ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందుతున్నదన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, జడ్పీటీసీ కొణకండ్ల వెంకటరెడ్డి, సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాలోత్ భోజ్యనాయక్, నాయకులు మేడా మోహన్రావు, ఉప్పతల ఏడుకొండలు, చీదెళ్ల పవన్కుమార్, ఇస్లావత్ నిరోషా, వాసం శివలలితజ్యోతి, బానోత్ రన్య తదితరులు పాల్గొన్నారు.
అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
అన్నపురెడ్డిపల్లి, అగస్టు 4: అన్నివర్గాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం అన్నపురెడ్డిపల్లి, గుంపెన, ఎర్రగుంటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు వ్యవసాయం చేయలేక ఆత్మహత్య చేసుకునేవారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగ అయిందన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఆయిల్పాం సాగులో అశ్వారావుపేట నియోజకవర్గం రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. ఆయిల్పాం సాగు విస్తరణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అనంతరం కురమ నాయకులు మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే మెచ్చాకు గొంగళ్లు కప్పి గొర్రె పిల్లలను బహూకరించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీటీసీ భారత లాలమ్మ, ఎంపీపీ సున్నం లలిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్రావు, ఎంపీటీసీ కాకా సీత, సర్పంచ్లు పద్మ, మిడియం సురేశ్, అగ్గి కవిత, ఉప సర్పంచ్లు నున్నా బసవయ్య, వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు, నాయకులు కొత్తూరి వెంకటేశ్వరరావు, కోటగిరి వరప్రసాదరావు, భారత రాంబాబు తదితరులు పాల్గొన్నారు.