తొలిరోజు ఇంజినీరింగ్ విభాగంలో పరీక్ష
ఖమ్మం ఎడ్యుకేషన్/కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఆగస్టు 4: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం ఉమ్మడి జిల్లాలో ఎంసెట్ పరీక్ష ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలోని ఆరు కేంద్రాలు, సూర్యాపేటలోని మూడు కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 1,537 మంది విద్యార్థులకు గాను 1,462 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,513 మందికి గాను 1,446 మంది విద్యార్థులు హాజరయ్యారు. హాజరుశాతం 95.57 శాతం నమోదైంది. కొత్తగూడెం జిల్లా కేంద్రం సమీపంలోని వేపలగడ్డ అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఎంసెట్ పరీక్షలు ప్రారంభయ్యాయి. ఉదయం జరిగిన పరీక్షకు 100 మందికి గాను 91 మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 96 మందికి గాను 88 మంది హాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కళాశాల నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు.
ఆన్లైన్లో నిర్వహణ..
పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లో జరిగాయి. ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ రూపొందించిన ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు కంప్యూటర్లో లాగిన్ అయినప్పటి నుంచి పరీక్ష ముగిసే వరకు నిపుణులు కేంద్రాల వద్దే అందుబాటులో ఉన్నారు. విద్యార్థుల హాల్టిక్కెట్లపై ఉన్న బార్కోడ్లు స్కాన్ చేయగానే వారి వివరాలు కంప్యూటర్లో నిక్షిప్తం అవుతాయి.
కొవిడ్ నిబంధనలు అమలు..
పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పకడ్బందీగా అమలయ్యాయి. ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే సిబ్బంది పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతిఒక్కరి చేతులను శానిటైజ్ చేశారు. మాస్క్లు అందించారు. నిమిషం ఆలస్యం నిబంధనలు అమలులో ఉండడంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు వచ్చేశారు.
కేంద్రాల వారీగా హాజరు..
ఉదయం సెషన్లో ఖమ్మం జిల్లాలోని డేర్ కాలేజీలో 173 మంది, బొమ్మ కాలేజీలో 167మంది, విజయ కాలేజీలో 231 మంది, ఎస్బీఐటీలో 228 మంది, కిట్స్లో 194 మంది, ప్రియదర్శినిలో 108 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో డేర్లో 171 మంది, బొమ్మలో 166 మంది, విజయలో 227మంది, ఎస్బీఐటీలో 221 మంది, కిట్స్లో 151 మంది, ప్రియదర్శినిలో 105 మంది హాజరయ్యారు.