307 మంది నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ
మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్
రాష్ర్టానికి వెలుగులు పంచే అవకాశం రావడం అదృష్టం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా
మణుగూరు రూరల్, ఆగస్టు 4: బీటీపీఎస్లో భూములు కోల్పోయి ఉద్యోగం ఆశించిన నిరుద్యోగుల కల నెరవేరిందని, సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బీటీపీఎస్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిరుద్యోగులకు బుధవారం ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీటీపీఎస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశం పినపాక ప్రజలకు దక్కడం అదృష్టంగా భావించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని రంగాలు అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నాయన్నారు. ప్లాంట్ నిర్మాణంతో ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుండడంతోపాటు ప్రజలకు ఉపాధి లభిస్తుందన్నారు. నిర్వాసిత నిరుద్యోగులకు నియామక పత్రాలు అందడం అందరికీ సంతోషకరమైన రోజు అని శుభాకాంక్షలు తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ సివిల్ జెన్కో అజయ్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి, ఇతర పరిస్థితులతో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్, సీఅండ్ఎండీ చైర్మన్ ప్రభాకర్రావు ప్రత్యేక చొరవతో 307 మందికి తొలిదఫా ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామన్నారు. హెచ్ఆర్ డైరెక్టర్ జెన్కో అశోక్ మాట్లాడుతూ.. ప్లాంట్ లోపల నిబంధనల ప్రకారం, క్రమశిక్షణతో తోటి ఉద్యోగులతో స్నేహపూరిత వాతావరణంలో నడుచుకోవాలన్నారు. ఉద్యోగ నిబంధనల ప్రకారం సర్వీస్ రూల్స్పై అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మణుగూరు, పినపాక జడ్పీటీసీలు పోశం నర్సింహారావు, గుమ్మడి గాంధీ, ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కేవీ రావు, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యుడు జావీద్పాషా, సర్పంచ్ కాయం తిరుపతమ్మ, కుర్సం రాంబాబు, కొమరం జంపేశ్వరి, బొగ్గం రజిత, కారం ముత్తయ్య, నాయకులు అడపా అప్పారావు, ముత్యంబాబు, బొలిశెట్టి నవీన్, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, తంత్రపల్లి కృష్ణ, ముద్దంగుల కృష్ణ, సాగర్, హర్షవర్ధన్, రుద్రవెంకట్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా
బీటీపీఎస్లో భూములు కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఉద్యోగం వస్తుందో రాదో అనుకున్నా. ఉద్యోగ కల నెరవేరింది. నేను ఎంసీఏ చేసినప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా క్యాజువల్ లేబర్గా పనిచేశా. ఉద్యోగపత్రం అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ క్షణాన్ని జీవితంలో మర్చిపోలేను. ఉద్యోగ నియామక పత్రం అందించిన సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంటాం.
-తబసుమ్, జూనియర్ అసిస్టెంట్