పాజిటివ్ కేసులను ఐసొలేషన్కు పంపాలి
అధికారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశం
రఘునాథపాలెం, జూన్ 4 : గ్రామాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల కట్టడి కోసం మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. రఘునాథపాలెం మండలంలోని కోయచలక, ఈర్లపూడి గ్రామాల్లోని ఐసొలేషన్ కేంద్రాలను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కేసుల సంఖ్య అత్యధికంగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేకాధికారులతోపాటు మండల స్థాయి అధికారులు విస్తృతంగా పర్యటించి పాజిటివ్ కేసులను గుర్తించి ఐసొలేషన్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఒక్కరి వల్ల కుటుంబంలో మిగిలి వారికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని అవగాహన కల్పించాలన్నారు. మండల స్థాయిలోని తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్హెచ్వో, కార్యదర్శి ప్రతి గ్రామాన్ని సందర్శించి పాజిటివ్ కేసుల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. ప్రధానంగా గ్రామాల్లో పాజిటివ్ కేసులను తగ్గించేందుకు నిత్యం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఇళ్లల్లో సరైన సదుపాయాలు లేని కొవిడ్ పాజిటివ్ బాధితుల కుటుంబాలకు అవగాహన కల్పించి ఐసొలేషన్కు పంపాలని, అక్కడ మెరుగైన సేవలందించాలని సూచించారు. తద్వారా జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గించవచ్చునన్నారు. ఆ దిశగా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల పట్ల ఆశ్రద్ధ, నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. తహసీల్దార్ నర్సింహారావు, ఎంపీడీవో అశోక్కుమార్, ఎస్సై వరాల శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి విజయకుమారి, ఎంపీవో శ్రీదేవి, సెక్రటరీలు పాల్గొన్నారు.