కొవిడ్ నిబంధనలతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
పలు డివిజన్లలో పోలింగ్ తీరును పరిశీలించిన మంత్రి పువ్వాడ
రఘునాథపాలెం/ ఖమ్మం రూరల్, ఏప్రిల్ 30: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారంతో నగరంలో ఓట్ల పండుగ హడావిడికి తెర పడింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా జిల్లా పోలీసు శాఖ పోలింగ్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు నిర్వహించింది. పలు డివిజన్లలో పోలింగ్ విధానాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పర్యవేక్షించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 5 గంటలకు వరకు సాగింది. అప్పటికే క్యూలో ఉన్న ఓటర్లకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. ఓటర్లు ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చి ఓటు వేశారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్కుల అందుబాటులో ఉంచారు. ఓటర్లు క్యూలైన్ దగ్గరగా నిల్చోకుండా బాక్సులను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ వేగంగా సాగింది. కాగా మంచాలకే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు తమ కుటుంబ సభ్యులు, సహాయకుల సాయంతో కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరోనా కారణంగా పలు డివిజన్లలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. ఎన్నికల పరిశీలకులు పోలింగ్ విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. డివిజన్ల నుంచి పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు కూడా తమ తమ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించారు. పోలింగ్ సందర్భంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు వాహనాలను కూడా సమకూర్చారు.
59, 60 డివిజన్లలో..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 59, 60 డివిజన్లు అయిన రామన్నపేట, కామంచికల్లో శుక్రవారం ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు డివిజన్ల పరిధిలోని 11 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 59వ డివిజన్లో 3,689 ఓటర్లకు గాను 3,007 మంది, 60వ డివిజన్లో 3,382 ఓటర్లకు గాను 2,942 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భౌతిక దూరం పాటిస్తూ ఓట్లు వేశారు. కొవిడ్ నిబంధనలు పాటించారు. పోలీసులు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ సందర్శించారు.